మనీలా: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించగా.. సింధుతో పాటు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ముందంజ వేసింది.
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో నాలుగో సీడ్ సింధు 21-16, 21-16తో జాస్లిన్ పై విజయం సాధించింది. 42 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు అదరగొట్టింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జంట 21-17, 21-15తో అకీరా కొగా- తైచీ సైటో ద్వయంపై గెలుపొందింది. తదుపరి రౌండ్లో మూడో సీడ్ హే బింగ్ జియావోతో సింధు.. మలేషియా జోడీతో సాత్విక్ జంట అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు మూడు పతకాలు నెగ్గిన సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్లో 21-12, 7-21, 13-21తో వాంగ్ జీ హీ చేతిలో ఓడగా.. పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ 16-21, 21-17, 17-21తో వెంగ్ హాంగ్ యాంగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు.