దుబాయ్ : ఈనెల 3 నుంచి బ్రిటన్లో మొదలుకాబోయే ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడేందుకు గాను లండన్కు పయనమైన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. దుబాయ్ విమానాశ్రయంలోనే ఆగిపోయింది. దుబాయ్లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తున్న వేళ.. దుబాయ్ ఎయిర్పోర్ట్లో తాత్కాలికంగా అన్ని సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న సింధు.. విమానాశ్రయానికి చేరువలోనే తమకు పెద్ద పేలుడు శబ్దం వినిపించడమే గాక దట్టమైన పొగ వ్యాపించడంతో తాము అక్కడ్నుంచి పరుగులు తీశామని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వీడియోలో పేర్కొంది.
‘కొన్ని గంటల క్రితం మేం ఉన్న ఎయిర్పోర్ట్కు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. నా కోచ్, సహాయక సిబ్బంది అక్కడ్నుంచి హుటాహుటిన పరుగులు తీశాం. అది మా అందరికీ భయానక క్షణం’ అని తెలిపింది. అయితే ఇది జరిగిన కొద్దిసేపటికే దుబాయ్ విమానాశ్రయ అధికారులు, తమను సురక్షిత ప్రాంతానికి తరలించారని, తాము క్షేమంగా ఉన్నామని వీడియోలో పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె విమానాశ్రయ అధికారులు, దుబాయ్లోని భారత హైకమిషన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.