బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. థాయ్లాండ్ ఓపెన్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 క్వార్టర్స్లో శుక్రవారం సింధు 21-15, 20-22, 21-13తో ప్రపంచ నంబర్వన్ అకానే యామగుచి (జపాన్)పై గెలుపొందింది. 51 నిమిషాల పాటు సాగిన పోరులో ఆరో సీడ్ సింధు పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ముఖాముఖి పోరులో యామగుచిపై మంచి రికార్డు ఉన్న సింధు.. దాన్ని కొనసాగిస్తూ తొలి గేమ్ కైవసం చేసుకుంది. రెండో గేమ్లో జపాన్ అమ్మాయి నుంచి ప్రతిఘటన ఎదురవడంతో.. మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్కు వెళ్లింది. ఆఖరి గేమ్ ఆరంభం నుంచే తన అమ్ములపొదిలోని అస్ర్తాలను బయటకు తీసిన సింధు.. క్రాస్ కోర్టు స్మాష్లు, డ్రాప్ షాట్లతో యామగుచికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లు కొల్లగొట్టింది. శనివారం జరుగనున్న సెమీస్ పోరులో ఒలింపిక్ చాంపియన్ చెన్ యూ ఫీ (చైనా)తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది.