PV Sindhu | ఒలింపిక్స్ మహిళల విభాగంలో రెండు పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్గా చరిత్రకెక్కిన పీవీ సింధు.. గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది. రెండు ఒలింపిక్ పతకాలతో పాటు లెక్కలేనన్ని టైటిల్స్ ఖాతాలో వేసుకున్న ఈ తెలుగమ్మాయి.. ప్రస్తుతం ఒక్క టైటిల్ నెగ్గేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది. నిరుడు బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన అనంతరం సింధు.. మరో టైటిల్ గెలువలేకపోయింది. గాయం కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమైన ఈ తెలుగమ్మాయి.. తిరిగి కోలుకొని కోర్టులో అడుగుపెట్టినా.. మునుపటి జోరు కనబర్చలేకపోతున్నది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ర్యాంకింగ్ టోర్నీల్లో అడపాదడపా విజయాలు సాధిస్తున్నా.. నిలకడ కొనసాగించడంలో విఫలమవుతున్నది. ఇటీవలి కాలంలో ఓ సూపర్ సిరీస్ సెమీఫైనల్కు చేరడం తప్ప ఈ సీజన్లో సింధు చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయింది.
కెనడా ఓపెన్ సూపర్-500 టోర్నీలో మాత్రం సింధు జోరు కనబరుస్తున్నది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 21-16, 21-9తో టైలాను చిత్తుచేసిన సింధుకు ప్రిక్వార్టర్స్లో ప్రత్యర్థి నుంచి వాకొవర్ లభించింది. దీంతో నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన సింధు.. ఫాంగ్ జైతో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ 21-15, 21-11తో యోగర్ కొలిహో (బ్రెజిల్) నెగ్గి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న లక్ష్యసేన్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగి వరుస గేమ్ల్లో విజయం సాధించడం విశేషం. పురుషుల డబుల్స్లో ప్రసాద్-విష్ణువర్ధన్ గౌడ్ జోడీ ప్రిక్వార్టర్స్లో ఓడి ఇంటి బాటపట్టింది.