సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్కు పంజాబ్ కింగ్స్ ఊహించని షాకిచ్చింది. చివరి బంతిదాకా ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పంజాబ్దే పైచేయి అయింది. 200 పరుగుల భారీ ఛేదనలో గెలుపు మీద ఆశలు లేని స్థితి నుంచి గెలవడానికి పంజాబ్ అద్భుతమే చేసింది. ఆ జట్టు బ్యాటర్ శశాంక్ సింగ్ మెరుపులతో పాటు అశుతోష్ శర్మ పంజాబ్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు శుభ్మన్ గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్తో పాటు సాయి సుదర్శన్, తెవాటియా మెరుపులతో తొలుత గుజరాత్ భారీ స్కోరు సాధించింది. గుజరాత్కు నాలుగు మ్యాచ్లలో ఇది రెండో పరాభవం కాగా పంజాబ్కు నాలుగింట రెండో విజయం.
అహ్మదాబాద్: హోంగ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్ గెలుపు జోరుకు పంజాబ్ కింగ్స్ అడ్డుకట్ట వేసింది. అహ్మదాబాద్ వేదికగా ఆఖరి ఓవర్ దాకా ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో టైటాన్స్కు షాకిచ్చింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (48 బంతుల్లో 89, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ధ సెంచరీకి తోడు సాయి సుదర్శన్ (19 బంతుల్లో 33, 6 ఫోర్లు) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలో తడబడ్డా శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అసమాన పోరాటంతో పాటు ప్రభ్సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 35, 5 ఫోర్లు, 1 సిక్సర్), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31, 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించి పంజాబ్కు విజయాన్ని అందించారు. శశాంక్ సింగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
గిల్, సుదర్శన్ జోరు..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. పంజాబ్తో మ్యాచ్ అంటేనే విరుచుకుడే గిల్ తొలి ఓవర్లోనే సిక్సర్తో పరుగుల ఖాతా తెరిచినా రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన సాహా (11)ను రబాడా ఔట్ చేశాడు. మిల్లర్కు గాయం కారణంగా తుది జట్టులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ (26) నిరాశపరిచాడు. సాయి సుదర్శన్ రాకతో గుజరాత్ స్కోరుబోర్డు వేగం పుంజుకుంది. తొలి స్ట్రాటజిక్ టైమ ఔట్ (8 ఓవర్లకు) ముగిసేటప్పటికీ గుజరాత్ స్కోరు 65-1. ఈ స్థితి నుంచి గుజరాత్.. పంజాబ్ ఎదుట 200 భారీ లక్ష్యాన్ని నిర్దేశించిందంటే అందుకు కారణం గిల్, సుదర్శన్ దూకుడుతో పాటు ఆఖర్లో రాహుల్ తెవాటియా మెరుపులే. సికిందర్ రజా వేసిన 12వ ఓవర్లో గిల్ ఓ బౌండరీ సాధించగా సాయి వరుస ఫోర్లు బాదాడు. హర్షల్ పటేల్.. సాయి దూకుడుకు కళ్లెం వేయడంతో 53 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాక గిల్.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటించాడు. గుజరాత్ ఇన్నింగ్స్కు తెవాటియా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
పంజాబ్ తడబడ్డా..
లక్ష్య ఛేదనలో పంజాబ్కు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (1)ను ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయగా 13 బంతుల్లో 4 బౌండరీలు బాది జోరు మీద ఉన్న బెయిర్ స్టో (22)ను నూర్ అహ్మద్ బోల్తా కొట్టించాడు. గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ప్రభ్సిమ్రన్ సింగ్ సైతం అహ్మద్ బౌలింగ్లోనే మోహిత్ శర్మకు చిక్కాడు. పంజాబ్ను ఆదుకుంటారని బోలెడు ఆశలు పెట్టుకున్న సామ్ కరన్ (5), సికందర్ రజా(15) క్రీజులో నిలదొక్కుకోలేదు.
శశాంక్, అశుతోష్ అదుర్స్..
12 ఓవర్లలో 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్ను శశాంక్ సింగ్ ఆదుకున్నాడు. గెలుపు మీద ఆశలు లేని స్థితి నుంచి పంజాబ్ సంచలన విజయం సాధించిందంటే శశాంక్, అశుతోష్ల ఆటే కారణం. ఉమేశ్ వేసిన 11వ ఓవర్లో 4, 6, 4తో విధ్వంసాన్ని మొదలుపెట్టిన అతడు రషీద్ ఖాన్ ఓవర్లోనూ భారీ సిక్సర్ బాదాడు. జితేశ్ శర్మ (16) విఫలమైనా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అశుతోష్ శర్మ అజ్మతుల్లా ఓవర్లో మూడు ఫోర్లు సాధించాడు. చివరి 2 ఓవర్లలో పంజాబ్ విజయానికి 25 పరుగులు అవసరం కాగా మోహిత్ శర్మ వేసిన 19వ ఓవర్లో శశాంక్, అశుతోష్లు రెండు సిక్సర్లతో 18 పరుగులు రాబట్టారు. దర్శన్ నల్కండే ఆఖరి ఓవర్లో అశుతోష్ను ఔట్ చేసినా శశాంక్ రెండు ఫోర్లతో పంజాబ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
అహ్మదాబాద్లో ఇది రెండో అత్యధిక ఛేదన. అంతకుముందు కేకేఆర్.. గుజరాత్పై 205 పరుగులను ఛేదించగా తాజాగా పంజాబ్ 200 పరగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలుండగానే బాదేసింది.
సంక్షిప్త స్కోర్లుగుజరాత్ : 20 ఓవర్లలో 199/4 (గిల్ 89 నాటౌట్, సాయి 33, రబాడా 2/44, హర్ప్రీత్ 1/33)
పంజాబ్: 19.5 ఓవర్లలో 200/7(శశాంక్ 61 నాటౌట్, ప్రభ్సిమ్రన్ 35, నూర్ అహ్మద్ 2/32, ఉమేశ్ 1/35)