లక్నో: ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ మూడో విజయం నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్ల్లో పరాజయాల అనంతరం శనివారం జరిగిన పోరులో పంజాబ్ 2 వికెట్ల తేడాతో లక్నోను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 74; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకం సాధించగా.. కైల్ మయేర్స్ (29; ఒక ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు.
పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ 3, కగిసో రబడ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 161పరుగులు చేసింది. సికందర్ రజా (41 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (34; 5 ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడగా.. ఆఖర్లో షారుక్ ఖాన్ (10 బంతుల్లో 23 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) కీలక పరుగులు సాధించాడు. లక్నో బౌలర్లలో యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, మార్క్ వుడ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. సికందర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.