నామమాత్ర పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ నిరాశ పరిచింది. ప్లే ఆఫ్స్కు దూరమయ్యాక స్వచ్ఛగా ఆడుతుందేమో అనుకుంటే అదే తడబాటు కొనసాగించింది. విలియమ్సన్ గైర్హాజరీలో భువనేశ్వర్ జట్టుకు సారథ్యం వహించగా.. అభిషేక్ వర్మ మినహా తక్కిన వాళ్లంతా మెరుగైన ఆరంభాలను భారీ ఇన్నింగ్స్లుగా మలచడంలో విఫలమయ్యారు. దీంతో ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన రైజర్స్.. బౌలింగ్లోనూ మ్యాజిక్ కనబర్చ లేకపోయింది. టీమ్ఇండియా పిలుపు దక్కించుకున్న ఉమ్రాన్ మాలిక్ కోటా పూర్తి కాకముందే మ్యాచ్ ముగిసిపోయింది!
ముంబై: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ 15వ సీజన్ ప్రస్థానాన్ని పరాజయంతో ముగించింది. లీగ్లో 14 మ్యాచ్లాడిన రైజర్స్ ఆరు విజయాలు, ఎనిమిది పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఎనిమిదో స్థానంతో ఇంటిబాట పట్టింది. ఆదివారం జరిగిన పోరులో రైజర్స్ 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. షెఫార్డ్ (26 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (25), మార్క్మ్ (21), రాహుల్ త్రిపాఠి (20) తలా కొన్ని పరుగులు చేశారు. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్వదేశానికి తిరిగి వెళ్లడంతో ఈ మ్యాచ్లో సన్రైజర్స్కు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్గా వ్యవహరించాడు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్, నాథన్ ఎలీస్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 15.1 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. లియామ్ లివింగ్స్టోన్ (22 బంతుల్లో 49 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టగా శిఖర్ ధవన్ (39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రైజర్స్ బౌలర్లలో ఫజల్లా ఫారూఖీ రెండు వికెట్లు పడగొట్టాడు.