చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ(63: 52 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేసింది. రోహిత్ ఒంటరి పోరాటం చేయడంతో ముంబై ఆమాత్రం స్కోరైనా చేసింది. సూర్యకుమార్ యాదవ్(33: 27 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్) ఫర్వాలేదనిపించాడు. క్వింటన్ డికాక్(3), ఇషాన్కిషన్(6), హార్దిక్ పాండ్య(1) మరోసారి నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లు కళ్లుచెదిరే బంతులతో బ్యాట్స్మెన్ను వణికించారు. రవి బిష్ణోయ్(2/21), దీపక్ హుడా(1/15),హెన్రిక్స్(0/12) ముంబైని కట్టడి చేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. దీపక్ హుడా వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ క్వింటన్ డికాక్(3) ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లలో పంజాబ్ కట్టుదిట్టంగా బంతులేయడంతో పవర్ప్లే ఆఖరికి 21/1తో నిలిచింది. ఐపీఎల్ 2021లో ఇప్పటి వరకు పవర్ప్లేలో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే. ఆరంభంలో తీవ్రంగా తడబడటంతో 10 ఓవర్లకు 49/2తో కష్టాల్లో పడింది. మధ్య ఓవర్లలో రోహిత్ విజృంభించడంతో గౌరవప్రదమైన స్కోరు దిశగా సాగింది. చివర్లో పొలార్డ్(16 నాటౌట్: 12 బంతుల్లో 1సిక్స్) కాస్త నిలబడటంతో 130 మార్క్ దాటింది.