బెంగళూరు: ఐపీఎల్-18లో ప్రత్యర్థులను వారి సొంత వేదికలపై చిత్తు చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. తమ సొంత ఇలాఖాలో మాత్రం మరోసారి ఓటమివైపు నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన గత రెండు మ్యాచ్ల్లో మాదిరిగానే పంజాబ్తోనూ అదే రిపీట్ అయింది. శుక్రవారం వర్షం అంతరాయంతో 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 96 పరుగుల ఛేదనలో పంజాబ్ 12.1 ఓవర్లలో 98/5 స్కోరు చేసింది. నేహాల్ వధేరా(19 బంతుల్లో 33 నాటౌట్, 3ఫోర్లు, 3సిక్స్లు) జట్టు విజయంలో కీలకమయ్యాడు. హాజిల్వుడ్(3/14), భువనేశ్వర్(2/26) ఆకట్టుకున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. బ్యాటర్ల వైఫల్యంతో 14 ఓవర్లలో 95/9కే పరిమితమైంది. అనిశ్చితికి మారుపేరైన ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్.. ఓపెనర్లు నిష్క్రమించగానే పెవిలియన్కు క్యూ కట్టింది. సాల్ట్ (4), కోహ్లీ (1), లివింగ్స్టొన్ (4), జితేశ్ (2), కృనాల్ (1) అలా వచ్చి ఇలా వెళ్లారు. టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్ పటీదార్ (18 బంతుల్లో 23, 1 ఫోర్, 1 సిక్స్) ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. పంజాబ్ బౌలర్లలో మార్కో యాన్సన్ (2/10), చాహల్ (2/11), అర్ష్దీప్ సింగ్ (2/23), హర్ప్రీత్ (2/25) తలా రెండు వికెట్లు తీసి ఆర్సీబీని కట్టడిచేశారు.
వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్ను 14 ఓవర్లకు కుదించగా.. బెంగళూరు బ్యాటర్లు అవి ఆడటానికీ తంటాలు పడ్డారు. ‘కింగ్స్’ బౌలర్ల ధాటికి ఆర్సీబీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అర్ష్దీప్ వరుస ఓవర్లలో బెంగళూరుకు బ్యాక్ టు బ్యాక్ షాకులిచ్చాడు. మొదటి ఓవర్లో సాల్ట్ను బోల్తా కొట్టించిన అతడు.. తన మరుసటి ఓవర్లో కోహ్లీని ఔట్ చేసి ఆర్సీబీని దెబ్బకొట్టాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన లివింగ్స్టొన్ను.. నాలుగో ఓవర్లో బార్ట్లెట్ పెవిలియన్కు పంపాడు. ఆరో ఓవర్లో బంతినందుకున్న చాహల్.. జితేశ్ శర్మను ఔట్ చేసి బెంగళూరును కోలుకోలేకుండా చేశాడు.
కృనాల్తో పాటు లివింగ్స్టొన్ స్థానంలో ఇంప్యాక్ట్ ప్లేయర్గా వచ్చిన బందగె (1) సైతం జాన్సన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరారు. సహచర బ్యాటర్లంతా పెవిలియన్ చేరుతున్నా 18 బంతులాడిన సారథి పటీదార్.. చాహల్ 8వ ఓవర్లో లాంగాఫ్ వద్ద బార్ట్లెట్ చేతికి చిక్కడంతో ఆర్సీబీ ఆశలు అడుగంటాయి. అయితే ఆఖర్లో డేవిడ్ మెరుపులతో బెంగళూరు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బార్ట్లెట్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన డేవిడ్.. హర్ప్రీత్ ఆఖరి ఓవర్లో మూడు సిక్సర్లు బాది ఈ లీగ్లో తన తొలి అర్ధ శతకాన్ని నమోదుచేశాడు.
ఆర్సీబీ నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యఛేదనను పంజాబ్ నెమ్మదిగా మొదలుపెట్టింది. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో 3 పరుగులే రాగా రెండో ఓవర్ నుంచి పంజాబ్ ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్సిమ్రన్ బ్యాట్లు ఝులిపించారు. దయాల్ రెండో ఓవర్లో ప్రియాన్ష్ స్లిప్పై నుంచి కొట్టిన షాట్ బౌండరీకి దూసుకెళ్లింది. భువీ ఓవర్లో ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రభ్సిమ్రన్ వరుసగా రెండు ఫోర్లు కొట్టి డేవిడ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్కు 22 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్పడింది.
ఆ తర్వాత 10 పరుగుల తేడాతో ప్రియాన్ష్ కూడా ఔట్ కావడంతో పంజాబ్ 32 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. బౌలింగ్ మార్పుగా వచ్చిన కృనాల్ పాండ్యాను లక్ష్యంగా చేసుకుంటూ ఇంగ్లిస్ బౌండరీలు బాదడంతో పంజాబ్ స్కోరు ఊపందుకుంది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్లో శ్రేయాస్(7)తో పాటు, ఇంగ్లిస్(14) ఔట్ చేయడం హాజిల్వుడ్..ఆర్సీబీకి అదిరిపోయే బ్రేక్ ఇచ్చాడు. అయితే క్రీజులో కుదరుకున్న నేహాల్ వధేరా..బెంగళూరు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ బౌండరీలతో చెలరేగాడు. శశాంక్ (1) నిరాశపరిచినా..స్టొయినిస్(7 నాటౌట్)తో కలిసి నేహాల్ జట్టును గెలిపించాడు.
బెంగళూరు: 14 ఓవర్లలో 95/9 (డేవిడ్ 50*, రజత్ 23, యాన్సన్ 2/10, చాహల్ 2/11),
పంజాబ్: 12.1 ఓవర్లలో 98/5(నేహాల్ 33 నాటౌట్, ప్రియాన్ష్ 16, హాజిల్వుడ్ 3/14, భువనేశ్వర్ 2/26)