ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. గత సీజన్లకు పూర్తి భిన్నంగా ముంబై గెలుపు కోసం చకోరా పక్షిలా ఎదురుచూస్తున్నది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా స్టార్ క్రికెటర్లతో కళకళలాడుతున్న ముంబై..అసలు సిసలు పోరులో తేలిపోతున్నది. పంజాబ్కింగ్స్తో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో రోహిత్సేన పోరాడి ఓడింది. కింగ్స్ నిర్దేశించిన లక్ష్యఛేదనలో ఓపెనర్లు విఫలమైన వేళ..బ్రెవిస్, సూర్యకుమార్ ఒంటరిపోరాటం ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆడిన ఐదు మ్యాచ్ల్లో అన్నింటా ఓటమి ఎదుర్కొన్న ముంబై ప్లేఆఫ్ అవకాశాలను దాదాపు చేజార్చుకుంది. తొలుత ధవన్, మయాంక్ అదరగొట్టడంతో పంజాబ్ పోరాడే స్కోరు అందుకుంది.
పుణె: ఐపీఎల్ 15వ సీజన్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్కు ఏదీ కలిసి రావడం లేదు. అనుభవజ్ఞులైన సీనియర్లకు తోడు ఉడుకురక్తంతో ఉరుకలెత్తుతున్న యువకుల మేళవింపుతో కనిపించిన ముంబై..అంచనాలకు పూర్తి భిన్నంగా రాణిస్తున్నది. మ్యాచ్ మ్యాచ్కు స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమవుతూ వస్తున్న రోహిత్సేన..పంజాబ్ కింగ్స్ ముందు మోకరిల్లింది. బుధవారం రసవత్తరంగా సాగిన మ్యాచ్లో ముంబై 12 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. ఐదు మ్యాచ్ల్లో ఐదు ఓటములు ఎదుర్కొన్న ముంబై ఇంకా గెలుపు ఖాతా తెరువకుండా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగుతున్నది. తొలుత ధవన్(50 బంతుల్లో 70, 5ఫోర్లు, 3సిక్స్లు), మయాంక్ అగర్వాల్(32 బంతుల్లో 52, 6ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలతో పంజాబ్ 20 ఓవర్లలో 198/5 స్కోరు చేసింది. ఆఖర్లో జితేశ్శర్మ(15 బంతుల్లో 30 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫటాఫట్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు.
థంపీ (2/47) రెండు వికెట్లు తీశాడు. 199 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ముంబై..9 వికెట్లకు 186 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్లు రోహిత్శర్మ (28), ఇషాన్కిషన్(3) నిరాశపరిచారు. డెవాల్డ్ బ్రెవిస్(49), సూర్యకుమార్ యాదవ్ (43), తిలక్వర్మ (36) మెరుపులు మెరిపించినా సహచరుల నుంచి సహకారం కరువైంది. ముఖ్యంగా బ్రెవిస్, వర్మ దూకుడైన బ్యాటింగ్తో ఓ దశలో గెలుపు ఆశలు రేగాయి. కానీ స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరి వికెట్లు కోల్పోవడంతో ముంబై మళ్లీ కోలుకోలేకపోయింది. ఆఖర్లో సూర్యకుమార్ ఒంటిచేత్తో పంజాబ్ను ఎదుర్కొనే ప్రయత్నం చేసినా జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోయాడు. హార్డ్హిట్టర్ పొలార్డ్(10) మరోమారు నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఒడెన్ స్మిత్ (4/30) మూడు వికెట్లు పడగొట్టి పంజాబ్ విజయంలో కీలక భూమిక పోషించాడు. రబాడ(2/29)కు రెండు వికెట్లు దక్కాయి. మయాంక్ అగర్వాల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ధవన్, అగర్వాల్ అదుర్స్:
ఓపెనర్లు శిఖర్ ధవన్(70), మయాంక్ అగర్వాల్(52) పంజాబ్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్శర్మ..పంజాబ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. గతానికి భిన్నంగా ఈసారి లీగ్లో దూకుడు మంత్రాన్ని పటిస్తున్న పంజాబ్ అందుకు తగ్గట్లు ఆది నుంచే పరుగుల కోసం ప్రయత్నించింది. థంపీ వేసిన తొలి ఓవర్ మొదటి బంతిని కవర్స్లో అగర్వాల్ చూడచక్కని ఫోర్ కొట్టాడు. ఇలా తమ ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పిన పంజాబ్ బ్యాటర్లు ఓవైపు మంచి బంతులను గౌరవిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొల్లగొట్టారు. మురుగున్ అశ్విన్ను లక్ష్యంగా చేసుకున్న మయాంక్ వరుస బంతుల్లోరెండు ఫోర్లు, భారీ సిక్స్తో విజృంభించాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. వీరిద్దరి జోరుకు బ్రేక్ వేద్దామనుకున్న రోహిత్ ప్రయత్నాలు నెరవేరలేదు. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది.
ఈ క్రమంలో ఇన్నింగ్స్ పదో ఓవర్లో సిక్స్తో అగర్వాల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో ధవన్..అగర్వాల్కు చక్కని సహకారం అందించాడు. ఇన్నింగ్స్ టాప్గేర్లో దూసుకుపోతున్న తరుణంలో అగర్వాల్ను అశ్విన్ పెవిలియన్ పంపాడు. దీంతో తొలి వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన బెయిర్స్టో(12), లివింగ్స్టోన్(2) తీవ్రంగా నిరాశపరిచారు.
అయితే జితేశ్శర్మ(30 నాటౌట్), షారుఖ్ఖాన్(15) వీరవిహారం చేశారు. ముఖ్యంగా జితేశ్ కొట్టిన కొట్టుడుకు స్టేడియం హోరెత్తిపోయింది. బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా ఈ యువ బ్యాటర్ చెలరేగిన తీరు అద్భుతం. ఓవైపు అప్పటికే అర్ధసెంచరీతో జోరు మీద కనిపించిన ధవన్ ఔటైనా..జితేశ్ ఏమాత్రం వెనుకకు తగ్గకుండా బ్యాటు ఝులిపించాడు. ఉన్కదత్ బౌలింగ్లో 6,4, 6 అరుసుకున్నాడు. మరోవైపు షారుఖ్ఖాన్ కూడా తాను తగ్గేదేం లేదన్నట్లు థంపీ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రెండు భారీసిక్స్లతో విరుచుకుపడటంతో పంజాబ్ భారీ స్కోరు అందుకుంది. తొలి పది ఓవర్లలో 99 పరుగులు చేసిన పంజాబ్..మిగిలిన పది ఓవర్లలో అన్నే పరుగులు చేసింది.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 20 ఓవర్లలో 198/5 (ధవన్ 70, మయాంక్ 52, థంపీ 2/47, బుమ్రా 1/28), ముంబై: 20 ఓవర్లలో 186/9 (బ్రెవిస్ 49, సూర్యకుమార్ 43, స్మిత్ 4/30, రబాడ 2/29)