కెరీర్లో తొలిసారి ఒకరు.. నాలుగేండ్ల విరామం తర్వాత మరొకరు శతకాలతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్తో తొలి టెస్టులో టీమ్ఇండియా విజయానికి చేరువైంది. రోహిత్శర్మ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన శుభ్మన్ గిల్ సుదీర్ఘ ఫార్మాట్లో తొలి సెంచరీ నమోదు చేసుకోగా.. వన్డౌన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా చాన్నాళ్ల తర్వాత మూడంకెల స్కోరు చేశాడు. వీరిద్దరి వీరబాదుడుతో భారీ స్కోరు చేసిన భారత్.. బంగ్లా ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో ఫలితం తేలడం పక్కా కాగా.. బంగ్లా ఏమాత్రం పోరాడుతుందో చూడాలి!
చటోగ్రామ్: బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా.. టెస్టు సిరీస్లో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. ఫ్లాట్ పిచ్పై మనవాళ్లు దుమ్మురేపడంతో బంగ్లా ముందు భారీ లక్ష్యం నిలిచింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (152 బంతుల్లో 110; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (130 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు) శతక్కొట్టడంతో భారత్ 258/2 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (23) మరోమారు విఫలం కాగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (19 నాటౌట్) అజేయంగా నిలిచాడు.
బంగ్లా బౌలర్లలో ఖాలెద్, మెహదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 133/8తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా.. మరో 17 పరుగులు జోడించి 150 రన్స్కు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (28) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5, హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. దీంతో భారత్కు 254 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించగా.. రెండో ఇన్నింగ్స్లో భారత్ దంచికొట్టింది. 513 పరుగుల టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. నజ్ముల్ హసన్ (25 బ్యాటింగ్), జాకిర్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న బంగ్లా.. విజయానికి 471 పరుగుల దూరంలో ఉంది.
మిగిలిన రెండు వికెట్లతో మూడో రోజు బంగ్లా గంట సేపు పోరాటం చేయగా.. కుల్దీప్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా.. వన్డే తరహాలో వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేసింది. తొలి వికెట్కు 70 పరుగులు జోడించిన తర్వాత రాహుల్ ఔట్ కాగా.. చతేశ్వర్ పుజారా తన శైలికి భిన్నంగా వేగంగా పరుగులు రాబట్టాడు. క్రీజులో కుదురుకునేందుకు ఎక్కువ సమయం తీసుకునే పుజ్జీ.. ఈసారి ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లపై యుద్ధం ప్రకటించాడు. మరో ఎండ్లో గిల్ కూడా ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
ఈ క్రమంలో గిల్ కెరీర్లో తొలి టెస్టు సెంచరీ తన పేరిట రాసుకున్నాడు. ఈ ఏడాదే తొలి వన్డే శతకం నమోదు చేసుకున్న గిల్ ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్లోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాడు. ఈ పంజాబ్ కా పుత్తర్ మంచి క్రికెటింగ్ షాట్లతో అలరిస్తే.. చతేశ్వర్ పుజారా దాదాపు నాలుగేండ్ల తర్వాత సెంచరీ చేశాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన పుజ్జీ.. చాన్నాళ్ల తర్వాత తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. స్కోరు పెంచే క్రమంలో గిల్ ఔట్ కాగా.. ఆ తర్వాత పుజారా బాదే బాధ్యత తీసుకున్నాడు. తైజుల్ బౌలింగ్లో మిడాన్ మీదుగా ఫోర్ బాది 130 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. 52 ఇన్నింగ్స్ల తర్వాత పుజారాకు ఇది మొదటి శతకం కాగా.. అతడి కెరీర్లో ఇదే వేగవంతమైనది. టెస్టు జట్టులో చోటు దక్కడమే కష్టమనుకుంటున్న తరుణంలో పుజారా తన విలువ చాటుకున్నాడు. అప్పటికే ఆధిక్యం ఐదొందలు దాటడంతో.. టీమ్ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం 12 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా రోజును ముగించింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ 404; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 150 ఆలౌట్ (ముష్పికర్ 28, మెహదీ హసన్ 25; కుల్దీప్ 5/40, సిరాజ్ 3/20), భారత్ రెండో ఇన్నింగ్స్: 258/2 డిక్లేర్డ్ (గిల్ 110, పుజారా 102 నాటౌట్; ఖాలెద్ 1/51), బంగ్లా రెండో ఇన్నింగ్స్: 42/0 (నజ్ముల్ 25 నాటౌట్, జాకిర్ 17 నాటౌట్).