న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రెజ్లర్లు నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఆయన్ను అరెస్టు చేయాలని కోరుతూ టాప్ రెజ్లర్లు ఆందోళన చేపడుతున్నారు. అయితే ఆ ఆందోళనల గురించి మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మాట్లాడారు. ఓ కార్యక్రమంలో ఆయన స్పందిస్తూ .. రెజ్లర్లు ఎందుకు నిరసన చేపడుతున్నారో తనకు తెలియదని, కానీ ఆ సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
గంగూలీ చేసిన ఆ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi) తన ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. గొప్పవాళ్లు విలువ కోల్పోతుంటారని, మాట్లాడాల్సిన వాళ్లే మౌనంగా ఉండిపోతున్నారని, ఇది తమ యుద్ధం కాదని చెప్పిన వ్యక్తి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారని చతుర్వేది తన ట్వీట్లో ప్రశ్నించారు. ఏదో ఒక రోజు ఆ పరిస్థితి ఎదురైనప్పుడు తన వైపు మాట్లాడేందుకు మనుషులు ఉంటారని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
The heroes fall, every single day. Now I get the reason for the silence of those who should be speaking up- its not our battle so why take a stand.
They will come for you too someday, hope there would be enough people left to speak for you. https://t.co/695k2H4rWh— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) May 5, 2023
టాప్ రెజ్లర్లు సాక్షీ మాలిక్, భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్తో పాటు చాలా మంది రెజ్లర్లు జంతర్ మంతర్లో నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణ కింద ఎంపీ బ్రిజ్ భూషణ్పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఫిర్యాదు ఇచ్చిన ఏడు మంది వాంగ్మూలాన్ని తీసుకున్నారు. బ్రిజ్ను అరెస్టు చేసే వరకు తాము ఆందోళన కొనసాగుతుందని రెజ్లర్లు స్పష్టం చేశారు.