Thomas Cup | చెంగ్డూ: థామస్ కప్ ఫైనల్స్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత షట్లర్లు జోరు కొనసాగిస్తున్నారు. చెంగ్డూ (చైనా) వేదికగా జరుగుతున్న ఈ ఈవెంట్లో భాగంగా భారత్ 5-0 తేడాతో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించి క్వార్టర్స్ బెర్తు ఖరారు చేసుకుంది. ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లు హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జితో పాటు డబుల్స్లో స్టార్ జోడీ సాత్విక్-చిరాగ్, అర్జున్-ధ్రువ్ వరుస విజయాలతో అదరగొట్టారు.
మొదటి సింగిల్స్లో ప్రపంచ 9వ ర్యాంకర్ ప్రణయ్.. 21-15, 21-15 తేడాతో హ్యారీ హువాంగ్ను ఓడించి భారత్ను ఆధిక్యంలోకి తెచ్చాడు. ఆ తర్వాత డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్.. 21-17, 19-21, 21-15 తేడాతో ప్రపంచ 3వ ర్యాంకు జంట బెన్ లేన్-సీన్ను ఓడించింది. రెండో సింగిల్స్లో శ్రీకాంత్.. 21-16, 21-19 నదీమ్ దల్విపై వరుస సెట్లలో గెలిచి భారత్కు విజయాన్ని ఖాయం చేశాడు. రెండో డబుల్స్లో అర్జున్-కపిల్ ద్వయం 21-17, 21-19 తేడాతో రోరీ ఈస్టన్ – అలెక్స్ గ్రీన్పై గెలిచింది. ఆఖరి సింగిల్స్లో కిరణ్ జార్జి 21-18, 21-12 తేడాతో చమన్ చొలన్ను ఓడించి ఇంగ్లండ్పై విజయాన్ని పరిపూర్ణం చేశాడు.