Prithvi Shaw | ముంబై ఆటగాడు పృథ్వీ షా రంజీ ట్రోఫీ కెరీర్లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 383 బంతుల్లో 379 పరుగులు చేసి.. తృటిలో నాలుగో సెంచరీని వదులుకున్నాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది రెండో అత్యధిక ఇన్నింగ్గా నమోదైంది. అంతకు ముందు బీబీ నింబాల్కర్ 1948-49 సీజన్లో మహారాష్ట్ర తరపున 443 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడి రికార్డు నెలకొల్పాడు. రంజీ ట్రోఫీలో ఓపెనర్ చేసిన అత్యధిక స్కోరు కూడా పృథ్వీదే. 379 పరుగులు చేసిన త్రిపుర ఆటగాడు సమిత్ గోహెల్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. గోహెల్ 2016 లో 359 పరుగులతో నాటౌట్గా ఇన్నింగ్స్ ఆడాడు.
రంజీ ట్రోఫీ రౌండ్-5 మ్యాచ్ ముంబై-అసోం మధ్య గౌహతిలో జరుగుతున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు మంగళవారం 2 వికెట్లకు 397 పరుగులు చేసింది. పృథ్వీ 240 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బుధవారం తొలి సెషన్లో 326 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసిన పృథ్వీషా 379 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు 49 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. రంజీ ట్రోఫీలో అతడి అత్యుత్తమ స్కోరు కూడా ఇదే. అంతకుముందు పృథ్వీషా 2019-20 రంజీ సీజన్లో బరోడాపై 202 పరుగులు చేశాడు. రెండో సెషన్లో ముంబై 3 వికెట్లకు 608 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే సెంచరీ చేసి సర్ఫరాజ్ ఖాన్తో కలిసి ఆడుతున్నాడు.
రంజీ ట్రోఫీలో ముంబై ఆటగాడు చేసిన అత్యధిక స్కోరును కూడా పృథ్వీషాదే కావడం విశేషం. 1990-91 సీజన్లో హైదరాబాద్పై ముంబై తరఫున ఆడిన సంజయ్ మంజ్రేకర్ 377 పరుగులు చేశాడు. ప్రస్తుత రంజీ మ్యాచ్లో 379 పరుగులు చేసిన పృథ్వీషా.. 33 ఏండ్ల క్రితం సంజయ్ మంజ్రేకర్ నెలకొల్పిన రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ప్రస్తుత సీజన్లో 4 మ్యాచుల్లో 2 గెలిచి ఎలైట్ గ్రూప్-బీ పాయింట్ల పట్టికలో ముంబై జట్టు రెండో స్థానంలో ఉన్నది. ఒక మ్యాచ్లో ఓడిపోగా.. ఒకటి డ్రా చేసుకోవడంతో ఈ జట్టుకు 16 పాయింట్లు వచ్చాయి. ఈ గ్రూప్లో సౌరాష్ట్ర జట్టు 19 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది. ఈ గ్రూప్లోని టాప్-2 జట్లు నాకౌట్ రౌండ్లో ఆడతాయి.