న్యూఢిల్లీ: జాతీయ క్రీడా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్లేయర్ల ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్లేయర్లను అవార్డులు వరించాయి. అతిరథ మహారథుల సమక్షంలో బుధవారం రాష్ట్రపతి భవన్ వేదికగా జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
రాష్ట్రం నుంచి యువ ప్లేయర్లు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ అర్జున అవార్డులు అందుకున్నారు. అతిథుల కరతాళ ధ్వనుల మధ్య శ్రీజ, నిఖత్ అర్జున పురస్కారాలు సొంతం చేసుకున్నారు. తన పవర్ఫుల్ పంచ్లతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్తో పాటు కామన్వెల్త్ గేమ్స్లో పసిడి పతకాలతో చరిత్ర సృష్టించిన ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ కెరీర్లో అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్నది. పారిస్(2024) ఒలింపిక్స్కు అర్హత సాధించడమే లక్ష్యంగా నిఖత్ సిద్ధమవుతున్నది. మరోవైపు పిట్టకొంచెం కూత ఘనమన్నట్లు టేబుల్ టెన్నిస్లో ఆకుల శ్రీజ అదరగొడుతున్నది. దిగ్గజ ప్లేయర్ శరత్ కమల్తో కలిసి మిక్స్డ్ డబుల్స్లో పసిడితో కొత్త చరిత్ర లిఖించిన శ్రీజ విశ్వక్రీడలకు సన్నద్ధమవుతున్నది. ఎలాగైనా పతకం సాధించడమే లక్ష్యంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. టీటీలో అపార ప్రతిభ కనబరిచిన శరత్ కమల్కు ధ్యాన్చంద్ ఖేల్త్న్ర పురస్కారం దక్కింది.