ఉలన్బాతర్ (మంగోలియా) : ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. గురువారం ఫైనల్ బరిలో నిలిచిన ఆరుగురిలో ఏకంగా నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలతో సత్తాచాటారు. మీనాక్షి హుడా (48 కిలోలు), ప్రీతి పవార్ (54 కి.), ప్రియా గంఘాస్ (60 కి.), అరుంధతి చౌదరి (70 కి.) పసిడి పంచ్లు విసరగా అల్ఫియా (80+ కి.), జైస్మీన్ లంబొరియా (57 కి.) ఫైనల్లో ఓడినా రజతాలు గెలుచుకున్నారు.
గురువారం తొలి పోరులో మీనాక్షి తన జోరును కొనసాగిస్తూ 5-0తో నొముందరి అమగలన్ (మంగోలియా)ను చిత్తు చేసింది. ఆ తర్వాత ప్రీతి సైతం అదే దూకుడుతో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత హువాంగ్ సియావొ-వెన్ (చైనీస్ తైపీ)పై గెలిచి పసిడి సంబురాన్ని డబుల్ చేసింది. ఆ ఇద్దరి బాటలోనే నడిచిన ప్రియా.. 3-0తో వొన్ ఉన్-గ్యాంగ్ (ఉత్తర కొరియా)ను ఓడించగా అరుంధతి 4-1తో కజకిస్థాన్ బాక్సర్ సీడిష్పై నెగ్గింది.
ఇదిలాఉండగా టోర్నీ ఆసాంతం రాణించిన జైస్మీన్ ఫైనల్లో 0-5తో పున్రివి (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలవ్వగా అల్ఫియా.. 0-5తో ఇస్లాంబెకొవ(కజికిస్థాన్) సైతం పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటిదాకా నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, 4 కాంస్యాలతో మొత్తం పది పతకాలు సాధించింది. పురుషుల విభాగంలో విశ్వనాథ్ (48 కి.), సచిన్ (60 కి.) శుక్రవారం తమ ఫైనల్స్ మ్యాచ్లు ఆడనున్నారు.