Praveen Kumar : భారత జట్టు మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్(Praveen Kumar ) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ(Lalit Modi) తనను భయపెట్టాడని, కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడని ప్రవీణ్ అన్నాడు. ‘ది లలన్టాప్’ అనే యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈ స్వింగ్ బౌలర్ మట్లాడుతూ.. ఐపీఎల్ ఆరంభ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) కాంట్రాక్టుపై సంతకం చేయకుంటే నా కెరీర్ను నాశానం చేస్తానని లలిత్ మోడీ బెదిరించాడని తెలిపాడు.
‘ఐపీఎల్ తొలి సీజన్లో ఆర్సీబీకి బదులు ఢిల్లీ డేర్డెవిల్స్(Delhi Daredevils)కు ఆడాలనుకున్నా. ఎందుకంటే బెంగళూరు మా స్వస్థలానికి చాలా దూరం. పైగా నాకు ఇంగ్లీష్ బాగా రాదు. అక్కడి ఫుడ్ కూడా నాకు పెద్దగా నచ్చదు. అందుకనే మీరట్కు దగ్గర్లో ఉన్న ఢిల్లీ డేర్డెవిల్స్ ఫ్రాంచైజీకి ఆడాలని డిసైడ్ అయ్యా.
అప్పుడు ఒకతను నన్ను కాంట్రాక్టుపై సంతకం చేయమన్నాడు. అయితే.. ఆ పేపర్స్ ఆర్సీబీ కాంట్రాక్టు సంబంధించినవని తెలిసి నేను ఒప్పుకోలేదు. దాంతో, లలిత్ మోడీ నన్ను పక్కకు పిలిచి.. బెంగళూరుకే ఆడాలని బెదిరించాడు. కాంట్రాక్ట్పై సంతకం పెట్టకుంటే నా కెరీర్ నాశనం చేస్తానని భయపెట్టాడు’ అని 37 ఏండ్ల ప్రవీణ్ వెల్లడించాడు.
ప్రవీణ్ కుమార్ 2007 నుంచి 2012 మధ్యలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా టీమిండియా తరఫున ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు మాత్రమే ఆడాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ఈ స్టార్ బౌలర్ ఆర్సీబీ, కింగ్స్ లెవన్ పంజాబ్, సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ వంటి ఫ్రాంచైజీలకు ఆడాడు.