హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు మరోమారు సత్తాచాటారు. చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ అదరగొడుతామని నిరూపించారు. నార్మండీ(ఫ్రాన్స్) వేదికగా మే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక వరల్డ్ స్కూల్ అథ్లెటిక్స్ టోర్నీకి ప్రణయ్, గణేశ్ ఎంపికయ్యారు. దీంతో టోర్నీలో రాష్ట్రం నుంచి బరిలోకి దిగుతున్న గురుకుల విద్యార్థుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఇది వరకే మాయావతి, రవికిరణ్ వరల్డ్ ఈ టోర్నీలో బెర్తు దక్కించుకున్నారు. జాతీయ స్థాయి చాంపియన్షిప్లలో నిలకడగా రాణించడం ద్వారా వీరిద్దరు మెగాటోర్నీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్నారు. జైపూర్ గురుకుల పాఠశాలకు చెందిన ప్రణయ్..ట్రిపుల్ జంప్లో బరిలోకి దిగుతుండగా, అచ్చంపేట విద్యార్థి గణేశ్..100 మీటర్ల రేసులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఎంపికైన ప్రణయ్, గణేశ్ను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రొనాల్డ్ రాస్ ప్రత్యేకంగా అభినందించారు. గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలో లాంగ్టర్మ్ అథ్లెటిక్స్ కోచింగ్ క్యాంప్(ఎల్ఏసీసీ)లో జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ నేతృత్వంలో యువ అథ్లెట్లకు అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నారు. ఈ క్యాంప్ నుంచి ఇప్పటికే చాలా మంది అథ్లెట్లు జాతీయ, అంతర్జాతీయ టోర్నీలకు ఎంపికవుతూ గురుకుల విద్యాసంస్థలకు మరింత పేరు తీసుకొస్తున్నారు.