టోక్యో: ఒలింపిక్స్ సంబురం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కరోనా విసిరిన సవాళ్లను అధిగమించి మొత్తానికి నిర్వాహకులు ఏడాది వాయిదా తర్వాత గేమ్స్ను విజయవంతంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. అయితే అదే సమయంలో జపాన్లోని ఇళ్లు లేని పేదలకు మాత్రం ఈ ఒలింపిక్స్ శాపంగా మారాయి. ఈ గేమ్స్ కోసం వేల కోట్లు ఖర్చు చేసిన జపాన్ ప్రభుత్వం.. అక్కడి పేదల పట్ల మాత్రం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. గేమ్స్ జరిగిన టోక్యో నగర వీధుల్లో టెంట్లు వేసుకొని బతికే పేదలను అక్కడి నుంచి ఖాళీ చేయించి మారుమూల ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అక్కడి వీధులు, రైల్వే స్టేషన్ల చుట్టుపక్కల, పార్కుల దగ్గర పేదలు వేసుకున్న తాత్కాలిక కార్డ్బోర్డ్ ఇళ్లను అక్కడి ప్రభుత్వం తొలగించినట్లు జపాన్ మీడియా వెల్లడించింది. 2019 సర్వే ప్రకారం జపాన్లో ఇళ్లు లేని వాళ్లు సుమారు 4 వేల మంది వరకూ ఉన్నారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా ప్రధానంగా చూపిస్తున్నా ప్రపంచ మీడియా మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలా మెగా ఈవెంట్లు జరిగినప్పుడు పేదలను మరో ప్రాంతానికి తరలించడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2010 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా ఢిల్లీలోనూ నిర్వాహకులు ఇలాగే చేశారు.