Pakistan Cricket Board : వరల్డ్ కప్లో వరుస ఓటములతో పాకిస్థాన్ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ మెగా టోర్నీలో బాబర్ సేన ఆట మరీ అధ్వాన్నంగా ఉందనే బాధలో ఉన్న అభిమానులకు మరో షాక్.. జట్టు ఎంపికలో అవకతవకలు జరిగాయనే విషయం తెలియడంతో ఫ్యాన్స్ కోపంతో ఉడికిపోతున్నారు. ఈ నేపథ్యంలో జకా అష్రఫ్(Zaka Ashraf) నేతృత్వలోని పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతికి పాల్పడ్డారనే వార్తలు మీడియాలో గుప్పుమనడంతో.. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు మంగళవారం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
బాబర్ సేన పేలవ ఆటతీరుకు బాధ్యత వహిస్తూ.. చీఫ్ సెలెక్టర్గా ఉన్న ఇంజమామ్ ఉల్ హక్(inzamam-Ul-Haq) సోమవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ‘వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదు. ఈ అంశంపై పీసీబీ విచారణ చేపట్టాలి. నాకు ప్లేయర్ ఏజెంట్ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేదు’ అని ఇంజమామ్ తన రాజీనామ లేఖలో పేర్కొన్నాడు.
ఇస్లామాబాద్ వేదికగా నడిచే ‘యజో ఇంటర్నేషనల్ లిమిటెడ్’ ప్లేయర్స్ ఏజెన్సీలో ఇంజమామ్కు పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతం పాక్ టీమ్లో ఉన్న బాబర్ ఆజమ్, పేసర్ షహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్తో పాటు మరికొందరికి ఈ సంస్థతో అనుబంధం ఉంది. దాంతో, ఇంజమామ్కు అనుకూలంగా ఉండే ఆటగాళ్లనే వరల్డ్ కప్ పోటీలకు ఎంపిక చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంజమామ్పై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే అతడిపై తీవ్ర చర్యలుంటాయని పీసీబీ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్తో పాటు కెప్టెన్ బాబర్ ఆజమ్ల ప్రైవేట్ చాట్ లీక్ అవడం.. వన్డే వరల్డ్ కప్ తర్వాత పాక్ సారథిపై వేటు తప్పదనే వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి.