Asia Cup-2023 | ఆసియా కప్ నిర్వహణపై బీసీసీఐ సెక్రెటరీ జైషా చేసిన ప్రకటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉలిక్కిపడింది. ఆసియా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిర్ణయం తీసుకోవాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ను కోరింది. ఆసియా కప్-2023 పాక్లో జరుగనుండగా.. భారత జట్టు దాయాది దేశానికి వెళ్లదని, తటస్థ వేదికల్లో మ్యాచ్లు ఆడనున్నట్లు జైషా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై పాక్ క్రికెట్ బోర్డుతో పాటు ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ‘వచ్చే ఏడాది పాక్లో జరిగే ఆసియా కప్కు సంబంధించి ఏసీసీ అధ్యక్షుడు జైషా చేసిన వ్యాఖ్యలను పీసీబీ గమనించింది.
టోర్నీని తటస్థ వేదికగా నిర్వహిస్తామనడం ఆశ్చర్యంగా, నిరుత్సాహంగానూ ఉన్నది. ఆసియా క్రికెట్ కౌన్సిల్తో గానీ, టోర్నీకి ఆతిథ్యమిచ్చే పాక్ క్రికెట్ బోర్డుతో ఎలాంటి చర్చ లేకుండా, దాంతో కలిగే దీర్ఘకాలిక పరిణామాలను పరిగణలోకి తీసుకోకుండా జైషా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏసీసీ సమావేశంలో సభ్యుల సంపూర్ణ మద్దతుతో ఆసియా కప్కు ఆతిథ్య హక్కులు పాక్కు ఇవ్వడం జరిగింది. ఆసియా కప్ టోర్నీ మార్పుపై జైషా చేసిన ప్రకటన ఏకపక్షంగా ఉంది. 1983 సెప్టెంబర్లో ఏర్పాటైన ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ స్ఫూర్తికి విరుద్ధం.
ఏసీసీ, సభ్యుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆసియాలో క్రికెట్ను నిర్వహించేందుకు, అభివృద్ధి చేసేందుకు, ప్రోత్సహించేందుకు ఏర్పాటైంది. ఇలాంటి ప్రకటనల ప్రభావం మొత్తం ఆసియా, అంతర్జాతీయ క్రికెట్ కమ్యూనిటీని విభజిస్తుంది. 2023 ప్రపంచ కప్, 2024-2031 ఐసీసీ ఈవెంట్లను ప్రభావితం చేయవచ్చు’ అని పేర్కొంది. అయితే, జైషా ప్రకటనపై పీసీబీకి ఇంకా ఏసీసీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని, సున్నితమైన విషయమైనందున బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పీసీబీ కోరింది. ఇదిలా ఉండగా.. పలువురు పాక్ మాజీ ఆటగాళ్లు సైతం జైషా వ్యాఖ్యలను ఖండించారు.