ODI WC 2023 : భారత్ – పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు క్రికెట్ అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి ఉంటుంది. కాలేజీలు, ఆఫీసుల్లో ఎక్కడ చూసినా దాయాదుల పోరులో ఎవరు గెలుస్తారు? అని చర్చలే నడుస్తాయి. అంత క్రేజ్ ఉన్న భారత్, పాక్ జట్లు త్వరలోనే వన్డే వరల్డ్ కప్(ODI WC 2023)లో తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. అయితే.. నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో భారత్, పాక్ మ్యాచ్ నిర్వహించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) అధ్యక్షుడు నజం సేథీ(Najam Sethi) సంచలన కామెంట్స్ చేశాడు.
‘నేను ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. మేము భారత్కు రావడం లేదు. అహ్మదాబాద్లోని స్టేడియంలో భారత్, పాక్ మ్యాచ్ నిర్వహించడం వెనుక రాజకీయ కోణం ఉంది. అంతేకాదు మాకు, మా జట్టకు అహ్మదాబాద్ పట్టణంలో భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది’ అని నజం సేథీ తెలిపాడు. అంతేకాదు తమ జట్టు ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్లో వరల్డ్ కప్ ఆడే అవకాశం లేదని అతను తేల్చి చెప్పాడు.
షెడ్యూల్ ప్రకారం అయితే.. ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్ జరగాలి. కానీ, భారత జట్టు ఎట్టి పరిస్థితుల్లోనే పాక్ గడ్డపై అడుగుపెట్టడదని బీసీసీఐ సెక్రటరీ జై షా ఖరాకండీగా చెప్పాడు. దాంతో, ఈ మెగా టోర్నీ నిర్వహణపై బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదం తలెత్తింది. పీసీబీతో పాటు పాక్ మాజీ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు టీమిండియా తమ దేశంలో ఆసియా కప్ ఆడకుంటే తాము వన్డే వరల్డ్ కప్ను బాయ్కాట్ చేస్తామని హెచ్చరించారు. దాంతో, తటస్థ వేదిక అయిన యూఏఈలో టోర్నీ నిర్వహించేందుకు సన్నాహాలు జరిగాయి. కానీ, అఫ్గనిస్థాన్, శ్రీలంక జట్లు యూఏఈలో ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో, శ్రీలంకలో టోర్నీ పెట్టాలని అనుకుంటున్నారు.
ప్రపంచ కప్లో పాకిస్థాన్పై టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. గత ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్లోనూ భారత్ 4 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. మొదట పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 159 పరగులు చేసింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(82 నాటౌట్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు) అద్భుత ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాయాదితో భారత్ తలపడలేదు. స్వదేశంలో జరగనున్న వరల్డ్ కప్లో మళ్లీ ఇరుజట్లు ఢీ కొనే అవకాశం ఉంది. దాంతో, ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
టీ 20 వరల్డ్ కప్లో పాక్పై గెలిచాక ఉద్వేగానికి గురైన కోహ్లీ