కొలంబో: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్కు తమ తొలి మ్యాచ్లోనే చావుతప్పి కన్ను లొట్టపోయే పరిస్థితి ఏర్పడింది. శనివారం జరిగిన పోరులో పాక్ 3 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్పై చెమటోడ్చి నెగ్గింది. నిర్దేశిత 148 పరుగుల లక్ష్యాన్ని పాక్ మరో మూడు బంతులు మిగిలుండగా 7వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్(47) రాణించగా, ఆఖర్లో ఫహీమ్ అష్రఫ్(11 బంతుల్లో 29 నాటౌట్, 2ఫోర్లు, 3సిక్స్లు) ఆపద్బాంవునిలా ఆదుకున్నాడు. అయితే డచ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో ఒక దశలో 90/2తో మెరుగ్గా కనిపించిన పాక్ 16.1 ఓవర్లలో 114కు 7 వికెట్లు కోల్పోయింది.
చివరి రెండు ఓవర్లలో జట్టు విజయానికి 29 పరుగులు అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన అష్రఫ్ మూడు సిక్స్లు, ఒక ఫోర్తో 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో గెలుపు సమీకరణం కాస్తా ఆరు బంతుల్లో 5 పరుగులకు చేరగా, లీడ్ బౌలింగ్లో ఫోర్తో అష్రఫ్ మ్యాచ్ను ముగించాడు. అంతకుముందు కెప్టెన్ ఎడ్వర్డ్స్(37), లీడె(30) రాణించడంతో నెదర్లాండ్స్ 147 పరుగులు చేసింది.