IND vs PAK : టీ20 ప్రపంచకప్ సందడి మొదలైంది. లీగ్ మ్యాచ్లతో, ఆటగాళ్ల మెరుపులతో స్టేడియాలు దద్ధరిల్లిపోతున్నాయి. కానీ, అభిమానుల దృష్టి మాత్రం భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్పైనే ఉంది. భారత జట్టుతో ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పడంతో ఫిబ్రవరి 15న ఏం జరుగనుంది? అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు పట్టు సడలించనుందని సమాచారం. ఐసీసీ (ICC) ఆంక్షలతో కోట్లాది రూపాయలు కోల్పోవాల్సి వస్తుందనే భయానికి తోడు.. లాహోర్ దాడిని గుర్తు చేస్తూ శ్రీలంక క్రికెట్ (Srilanka Cricket) రాసిన మెయిల్తో పీసీబీ పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది.
పొట్టి ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్పై ఉత్కంఠ కొనసాగుతోంది. బంగ్లాదేశ్కు మద్దతుగా కొలంబోలో ఫిబ్రవరి 15న భారత జట్టుతో ఆడాల్సిన మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించడమే అందుకు కారణం. అయితే.. ఎంపిక పద్ధతిన వరల్డ్కప్లో ఆడాలనుకుంటున్ను పాకిస్థాన్పై భారీ ఆంక్షలు తప్పవని ఐసీసీ స్పష్టం చేసింది. ఆతిథ్య శ్రీలంక బోర్డు సైతం ఇండియాతో ఆడాలని కోరింది. లేదంటే ఆర్ధికంగా నష్టపోవడమే కాకుండా.. పరువూ పోతుందని పాక్ బోర్డును లంక క్రికెట్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పునరాలోచనలో పడిన పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నాడట.
🚨 SRI LANKA LAST WARNING TO PAKISTAN 🚨
– SLC warns PCB that Pakistan’s decision to boycott vs India will have financial sanctions 😆
– SLC reminded PCB of touring Pakistan despite challenging and sensitive situation 😨
– PCB is likely to Surrender 😆pic.twitter.com/IgnqqZMEps
— Richard Kettleborough (@RichKettle07) February 6, 2026
‘శ్రీలంక ప్రభుత్వంలోనే కాదు.. ఆ దేశం జట్టుతోనూ పాకిస్థాన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. లంక బోర్డు పంపిన ఈమెయిల్ను తేలికగా తీసుకోవడానికి లేదు. ఇప్పటికే శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా (Shammi Silva) పాక్ క్రికెట్ చీఫ్ మొహ్సిన్ నఖ్వీతో నేరుగా మాట్లాడాడు. ఈసాక్ పాక్ క్రికెట్ అవసరం తమకు ఏర్పడిందని, భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జరుగకుంటే తాము భారీగా నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆయన వాపోయాడు. దాంతో.. ఇండియా మ్యాచ్ బాయ్కాట్ విషయంపై పాక్ పునరాలోచనలో పడింది. ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడుతానని శ్రీలంక బోర్డు అధ్యక్షుడికి నఖ్వీ మాటిచ్చాడు. లంక ఈమెయిల్ను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి.. సోమవారం లోపు ప్రకటన చేస్తామని ఆయన చెప్పాడు’ అని పాక్ బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
నిరుడు నవంబర్లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక.. భద్రత విషయంలో రాజీ పడాల్సి వచ్చింది. స్టేడియానికి సమీపంలో బాంబు పేలుడతో భయాందోళనకు లోనైన లంక ఆటగాళ్లు సిరీస్ మధ్యలోనే స్వదేశం వచ్చేయాలనుకున్నారు. కానీ, పాక్ బోర్డు అభ్యర్థనతో తమ క్రికెటర్లను సిరీస్ ముగిశాకే రావాల్సిందిగా లంక బోర్డు ఆదేశించింది. సో.. ఇప్పుడు తమ దేశంలో నిర్వహిస్తున్న వరల్డ్కప్ మ్యాచ్ను పాక్ బాయ్కాట్ చేయడంపై లంక క్రికెట్ అభ్యంతరం వ్యక్తం చేసింది.