అహ్మదాబాద్ : ప్రపంచ కప్ కోసం ఏడేండ్ల తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టుకు ఎక్కడికి వెళ్లినా ఘనస్వాగతం లభిస్తోంది. హైదరాబాద్లో అభిమానుల ప్రేమకు, ఆతిథ్యానికి ఫిదా అయిన పాక్ క్రికెటర్లకు అహ్మదాబాద్లోనూ అదే తరహా అహ్వానం లభించింది. భారత జట్టుతో అక్టోబర్ 14న మ్యాచ్ కోసం బాబర్ ఆజం బృందం గురువారం అహ్మదాబాద్ చేరుకుంది. విమానాశ్రయం నుంచి టీమ్ హోటల్కు వెళ్లిన పాక్ ఆటగాళ్లను శాలువాతో సత్కరించి.. పూలు జల్లుతూ, బెలూన్లు విసురుతూ సాదరంగా ఆహ్వానించారు. డోలుబాజాల శబ్దానికి తగ్గట్టు కళాకారులు తమ నృత్య అభినయంతో వెల్కం చెప్పారు.
క్రికెట్లో గొప్ప సమరంగా అభివర్ణించే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా శనివారం జరుగనుంది. లక్షమందికి పైగా అభిమానులు పోటెత్తనున్న నేపథ్యంలో గుజరాత్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు హోమ్ గార్డ్స్ కలిపి మొత్తం 11 వేలకు పైగా బందోబస్త్లో పాల్గొననున్నారు. మెగాటోర్నీలో ఆడిన రెండు మ్యాచుల్లో గెలుపొందిన రోహిత్, బాబర్ సేనకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. అయితే.. ప్రపంచ కప్లో పాక్పై టీమ్ఇండియాకు ఘనమైన రికార్డు ఉన్న సంగతి తెలిసిందే.