ODI World Cup 2023 | ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో పోరులో పాకిస్థాన్ పేసర్ హరీస్ రవుఫ్ ఓ చిత్త రికార్డు మూటగట్టుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆసీస్ ఓపెనర్లు దంచికొడుతున్న సమయంలో తొమ్మిదో ఓవర్లో బౌలింగ్కు వచ్చిన రవుఫ్ ఆ ఓవర్లో ఏకంగా 24 పరుగులు సమర్పించుకున్నాడు. అందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్తో పాటు ఓ వైడ్ కూడా ఉంది. దీంతో ప్రపంచకప్లో పాకిస్థాన్ తరఫున ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల ఇచ్చిన పేసర్గా అపవాదు మూటగట్టుకున్నాడు.
తాజా ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో శ్రీలంక పేసర్ మతీశా పతిరణ ఒకే ఓవర్లో 26 పరుగులు సమర్పించుకోగా.. ఇప్పుడు రవుఫ్ 24 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో రవుఫ్ 3.3 ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో 21 బంతుల్లో అర్ధశతకం చేసుకున్న పాక్ పేసర్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.
అప్పుడు కోహ్లీ, ఇప్పుడు రోహిత్
నిరుడు ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్తో హరీస్ రవుఫ్ బాగా పాపులర్ అయ్యాడు. అప్పటి వరకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతాడని పేరున్న రవుఫ్ వేసిన 19వ ఓవర్ చివరి రెండు బంతులకు భారీ సిక్సర్లు బాదిన కోహ్లీ.. అమాంతం మ్యాచ్ను పాక్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. ఇక తాజా మెగాటోర్నీలో అహ్మదాబాద్ వేదికగా జరిగిన దాయాదుల పోరులో భారత సారథి రోహిత్ శర్మ.. రవుఫ్ బౌలింగ్ను ఓ ఆటాడుకున్నాడు. దీంతో అతడు సాధారణ బౌలర్గా మారిపోగా.. ఇప్పుడు కంగారూలు అతడి బౌలింగ్లో నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి పరుగుల వరద పారించారు.
పాకిస్థాన్ ప్రధాన పేసర్లలో ఒకడైన హరీస్ రవుఫ్ ఈ మ్యాచ్లో తన కోటా పూర్తి చేసుకోలేకపోయాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 8 ఓవర్లలో 83 పరుగులు చేసిన రవుఫ్ 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ మూడు వికెట్లు కూడా చివర్లో వచ్చినవే కాగా.. పదికి పైగా ఎకానమీతో రవుఫ్ పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.