దుబాయ్: టీ20 వరల్డ్కప్ అసలుసిసలు మ్యాచ్లకు టైమ్ దగ్గర పడింది. రెండో రౌండ్లో తొలి రోజే దాయాదులు ఇండియా, పాకిస్థాన్ తలపడబోతున్నాయి. ఇండోపాక్ మ్యాచ్..అందులోనూ సుమారు 28 నెలల తర్వాత జరుగుతుండటంతో ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా ఫ్యాన్స్ను సంతోషానికి గురి చేసే రికార్డు ఒకటి కెప్టెన్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. ఇప్పటి వరకూ టీ20 వరల్డ్కప్లో కోహ్లిని పాకిస్థాన్ ఒక్కసారి కూడా అవుట్ చేయలేకపోయింది.
టీ20 వరల్డ్కప్లలో పాక్పై మూడు మ్యాచ్లలో ఆడిన విరాట్.. అన్నింట్లోనూ నాటౌట్గా నిలవడం విశేషం. అంతేకాదు అతని స్ట్రైక్ రేట్ కూడా 130 ఉంది. ఈ మూడు మ్యాచ్లలో విరాట్ 169 పరుగులు చేశాడు. 2012 వరల్డ్కప్లో 78, 2014 వరల్డ్కప్లో 38, 2016 వరల్డ్కప్లో 55 పరుగులు చేసి అన్నిసార్లూ అజేయంగా నిలిచాడు.
టీ20 వరల్డ్కప్ అనే కాదు.. ఓవరాల్గా కూడా పాక్పై టీ20ల్లో కోహ్లికి అదిరిపోయే రికార్డు ఉంది. మొత్తం 6 టీ20ల్లో 254 పరుగులు చేశాడు. సగటు 84.66 కాగా.. మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. పాకిస్థాన్ అంటే కోహ్లి ఏ రేంజ్లో ఆడతాడో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న జరగబోయే మ్యాచ్లోనూ విరాట్ రెచ్చిపోయి ఆడాలని ఫ్యాన్స్ ఉబలాటపడుతున్నారు.