Gary Kirsten | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత పదవి నుంచి తొలగించనున్నట్లు పాక్ మాజీ క్రికెట్ బాసిత్ అలీ ఆ దేశ జాతీయ జట్టు హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ను హెచ్చరించారు. ఇటీవల పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇంతకు ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్లో పాక్ తొలిరౌండ్లోని నిష్క్రమించింది. బాబర్ ఆజం నేతృత్వంలోని జట్టు వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్కు చేరితే అదే పెద్ద అచీవ్మెంట్ అవుతుందని.. అలా జరగకపోతే కిర్స్టన్ కోచ్ పదవిని వీడాల్సి వస్తుందని బాసిత్ పేర్కొన్నారు. బాసిత్ తన యూట్యూబ్ ఛానల్ వెదికగా హెడ్ కోచ్కు అభినందనలు తెలుపుతూనే.. ఆయన జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీ వరకే కొనసాగుతాడన్నారు. ఆ తర్వాత తొలగిస్తారని.. అందుకే టాటా.. బైబై అని ఇప్పుడే చెబుతున్నానన్నారు. మొదటి నాలుగు స్థానాల్లో చోటు దక్కడం గొప్ప విజయమన్న బాసిత్.. పాకిస్థాన్ క్రికెట్లోకి రాజకీయాలు ఎంట్రీ ఇచ్చాయన్నారు.
ఇదిలా ఉండగా.. పాక్ క్రికెట్ బోర్డు నిర్వహించిన ఉన్నత స్థాయి శిబిరంలో గ్యారీ కిర్స్టన్ మాట్లాడుతూ వన్డేల్లో పాక్ క్రికెట్ని మెరుగుస్తామని.. మళ్లీ గర్వపడేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ శిబిరంలో బాబర్ అజామ్, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, షాన్ మసూద్ సహా తొమ్మిది మంది సీనియర్ పాక్ క్రికెటర్లు పాల్గొన్నారు. అసిస్టెంట్ కోచ్ అజర్ మహమూద్, హై పెర్ఫార్మెన్ డేవిడ్ రీడ్ సైతం ఉన్నారు. కనెక్షన్ క్యాంప్లో భవిష్యత్లో పాక్ క్రికెట్కు ఉపయోగపడే అనేక విషయాలపై చర్చించామన్నారు. పాక్ జట్టును అన్ని ఫార్మాట్లలో సాధ్యమైనంత వరకు విజయం సాధించాలని కోరుకుంటున్నామన్నారు. పాకిస్థాన్ క్రికెట్ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.