దుబాయ్: ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్ రాచెల్ హైన్స్కు ఈ పురస్కారం దక్కింది. మార్చి నెలకు గాను వీరిద్దరిని అవార్డులకు ఎంపిక చేసినట్లు ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు ఫార్మాట్ మ్యాచ్లలో బాబర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పాక్ కెప్టెన్ 390 పరుగులతో రాణించాడు. రెండో టెస్టులో రికార్డు స్థాయిలో 196 పరుగులతో ఆజమ్ అదరగొట్టాడు. అంతటితో ఆగకుండా వన్డేల్లోనూ విశ్వరూపం ప్రదర్శించిన ఆజమ్.. బ్రాత్వైట్ (వెస్టిండీస్), కమిన్స్(ఆస్ట్రేలియా)ను అధిగమిస్తూ అవార్డు దక్కించుకున్నాడు. మరోవైపు రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియా ఏడోసారి మహిళల వన్డే ప్రపంచకప్ గెలువడంలో రాచెల్ హైన్స్ కీలక పాత్ర పోషించింది. ఎనిమిది మ్యాచ్ల్లో 61.28 సగటుతో 429 పరుగులతో విజృంభించిన హేన్స్.. సోఫీ ఎకెల్స్టోన్ (ఇంగ్లండ్), లారా వోల్వార్డ్ (దక్షిణాఫ్రికా) దాటేసి అవార్డు ఖాతాలో వేసుకుంది.