Wasim Akram | ఆసియాకప్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలి కాలంలో క్రికెటర్లు పొట్టి ఫార్మాట్కు బాగా అలవాటు పడిపోయారని.. బౌలౖర్లెతే నాలుగు ఓవర్లు వేసి తమ పని ముగిసినట్లు భావిస్తున్నారని పేర్కొన్నాడు. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్నకు ముందు ఆసియాకప్ ద్వారా బౌలర్లు 10 ఓవర్లు వేయడానికి అలవాటు పడతారని అక్రమ్ అన్నాడు. కేవలం పాకిస్థాన్ బౌలర్లను ఉద్దేశించి మాత్రమే కాకుండా.. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ను కలిపి అక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ నెల 30 నుంచి ఆసియాకప్ ప్రారంభం కానుండగా.. పాకిస్థాన్ వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్లో నేపాల్తో పాక్ తలపడనుంది. ఈ నేపథ్యంలో అక్రమ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
‘కేవలం పాకిస్థాన్ అనే కాదు. భారత్, శ్రీలంక బౌలర్లు కూడా 10 ఓవర్లు వేయగలరా లేదా అనేది ఆసియాకప్లో తేలుతుంది. ఈ మధ్య కాలంలో బౌలర్లు నాలుగు ఓవర్లు వేయడానికి ఎక్కువ అలవాటు పడ్డారు. ఆసియాకప్ను 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహించడం మంచిదైంది. దీనివల్ల బౌలర్ల సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. వన్డే ప్రపంచకప్నకు ముందు అది మేనేజ్మెంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది. 50 ఓవర్ల ఆటకు భిన్నమైన మైండ్సెట్, ఫిట్నెస్ అవసరం. గత ఆసియాకప్లో భారత్, పాకిస్థాన్ ఫైనల్ చేరతాయని అందరూ అంచనా వేశారు. కానీ శ్రీలంక కప్పు ఎగరేసుకుపోయింది. ఈ సారి కూడా మూడు జట్లు బలంగానే ఉన్నాయి. ఎవరైనా గెలవొచ్చు. ఎప్పట్లాగే భారత్, పాకిస్థాన్ పోరంటే విపరీతమైన ఒత్తిడి ఉండటం సహజమే’ అని అక్రమ్ పేర్కొన్నాడు. ఆసియాకప్లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 2న పాకిస్థాన్తో తలపడనుంది.