న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్..! ఈ ఇద్దరూ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిభ కలిగిన బ్యాటర్లు. పైగా ఇద్దరూ క్రికెట్కు ఎనలేని ఆదరణ ఉన్న భారత్, పాకిస్థాన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విరాట్ కోహ్లీ ముందుగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి రికార్డుల మీద రికార్డులు నమోదు చేయగా.. ఆ తర్వాత క్రికెట్లోకి వచ్చిన బాబర్ అజామ్ ఆ రికార్డులను బద్దలు కొడుతూ వస్తున్నాడు.
ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్కు ఇవాళ కోహ్లీ మరో రికార్డును బద్దలుకొట్టే అవకాశం వచ్చింది. ఇవాళ కరాచీలో ఇంగ్లండ్తో జరుగబోయే 5వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో 61 పరుగులు చేస్తే.. కోహ్లీ రికార్డు బాబర్ పేరు మీదకు మారిపోనుంది. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో వేగంగా 3,000 పరుగుల మైలురాయిని చేరుకున్న బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. కేవలం 81 ఇన్నింగ్స్లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
ఇవాళ బాబర్ అజామ్కు ఆ రికార్డును తన పేరిట లిఖించుకునే ఛాన్స్ దొరికింది. అజామ్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో 79 ఇన్నింగ్స్ ఆడి 2,939 పరుగులు చేశాడు. ఇవాళ టీ20 సిరీస్లో భాగంగా పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్ జట్టుతో ఐదో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో బాబర్ అజామ్ మరో 61 పరుగులు చేస్తే.. 80 ఇన్నింగ్స్లో 3000 పరుగులు చేసినట్లవుతుంది. దాంతో అంతర్జాతీయ టీ20లలో అత్యంత వేగంగా మూడు వేల పరుగుల మైలురాయిని చేరిన బ్యాటర్గా బాబర్ నిలుస్తాడు.
ఇదిలావుంటే విరాట్ కోహ్లీకి, బాబర్ అజామ్కు మధ్య మంచి అనుబంధం ఉన్నది. వీరి పరిచయం కేవలం మూడేండ్లే అయినా కోహ్లీ అంటే అజామ్కు ఎంతో అభిమానం. అందుకే మన స్కిప్పర్ను అమితంగా గౌరవిస్తాడు. అదేవిధంగా బాబర్ అజామ్ సత్ప్రవర్తనకు కోహ్లీ ఫిదా అయ్యాడు. అజామ్ క్యారెక్టర్ను అవకాశం వచ్చినప్పుడల్లా పొగుడుతుంటాడు.