Cricket World Cup | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఈ ఆసక్తికర పోరుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్లో వరుసగా ఇది రెండో రోజు వరల్డ్కప్ మ్యాచ్ కావడం విశేషం. బ్యాటర్లకు స్వర్గధామమైన ఈ పిచ్పై పరుగుల వరద పారించేది ఎవరు? గెలుపు తలుపు తట్టేది ఎవరు? అని హైదరాబాద్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: వన్డే వరల్డ్ కప్లో ఉప్పల్ స్టేడియం వేదికగా మంగళవారం మరో ఆసక్తికర పోరాటం అభిమానులను అలరించనుంది. ఆసియా జట్లు పాకిస్థాన్, శ్రీలంక నువ్వానేనా అన్నట్లు తలపడనున్నాయి. మెగా టోర్నీలో నెదర్లాండ్స్పై సాధికార విజయంతో బాబర్ సేన బోణీ కొట్టగా.. దక్షిణాఫ్రికా చేతిలో దసున్ శనక బృందం 102 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఎలాగైనా పాకిస్థాన్పై భారీ తేడాతో గెలవాలని లంక భావిస్తోంది. మరోవైపు ఆసియా కప్లో ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన సూపర్-4 మ్యాచ్లో లంక చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ కసితో ఉంది. పైగా ఉప్పల్లో వామప్ సహా మూడు మ్యాచ్లు ఆడడం బాబర్ సేనకు కలిసొచ్చే అవకాశం ఉంది.
మైదానంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది. షాహీన్ అఫ్రీదీ, హరిస్ రవూఫ్, హసన్ అలీతో పాక్ పేస్ దళం భీకరంగా ఉండగా.. ఓపెనర్లు ఇమాముల్ హక్, ఫఖర్ జమాన్ వరుసగా విఫలం కావడంతో మిడిలార్డర్పై భారం పడుతోంది. కెప్టెన్ బాబర్, రిజ్వాన్, షకీల్ ఫామ్ కొనసాగిస్తే పాక్కు తిరుగుండదు. మరోవైపు.. కుశాల్ మెండిస్, ప్రథుమ్ నిస్సంక, చరిత అసలంక చెలరేగాలని లంక కోరుకుంటోంది. ఇక సఫారీల వీరబాదుడుకు భారీగా పరుగులు సమర్పించుకున్న తురుపుముక్క మహీశా పతిరణ, మధుషనక, రజితపైనే లంక గంపెడు ఆశలు పెట్టుకుంది. అయితే.. స్పిన్ విభాగంలో పాక్ కంటే శ్రీలంక మెరుగ్గా కనిపిస్తోంది. సఫారీలతో మ్యాచ్కు దూరమైన తీక్షణ జట్టుతో కలిశాడు. తనదైన రోజున బంతితో తిప్పేసే దునిత్ వెల్లలాగె, తీక్షణను పాక్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం.