Virat Kohli | ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీని మించిన ప్లేయర్ మరొకరు లేడని పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ పేర్కొన్నాడు. క్లిష్ట సమయాల్లో అతడి ఆటతీరు అమోఘమని కొనియాడాడు. ఒత్తిడిలో రాణించడంలో విరాట్ తర్వాతే ఎవరైనా అని పాక్ ఆల్రౌండర్ పేర్కొన్నాడు. నిరుడు ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ మరే ప్లేయర్కు సాధ్యం కాదని పేర్కొన్నాడు. మెల్బోర్న్ వేదికగా విరాట్ ప్రదర్శన అమోఘమని ఆకాశానికి ఎత్తాడు.
2022 టీ20 ప్రపంచకప్లో భాగంగా అక్టోబర్ 23న జరిగిన పోరులో కోహ్లీ అదిరిపోయే ఇన్నింగ్స్తో టీమ్ఇండియాను గెలిపించిన విషయం తెలిసిందే. ఇతర ఆటగాళ్లంతా విఫలమైన దశలో కోహ్లీ తన క్లాస్ పవర్ ఏంటో నిరూపించాడు. సహచరులంతా చేతులెత్తేసిన చోట విరాట్ తనలోని పోరాట వీరుడిని తట్టి లేపాడు. 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన దశలో మూడు ఫోర్లు బాదిన విరాట్.. 8 బంతుల్లో 28 పరుగులు అవసరమైన సమయంలో హరీస్ రవుఫ్ బౌలింగ్లో రెండు భారీ సిక్సర్లతో భారత్ను విజయానికి చేరువచేశాడు. రవుఫ్ బౌలింగ్లో అతడి తలమీదుగా కొట్టిన సిక్సర్.. అంతర్జాతీయ క్రికెట్లోనే అత్యుత్తమ షాట్గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఒత్తిడి చిత్తు చేస్తున్న సమయంలో చివరి వరకు అజేయంగా క్రీజులో నిలిచి జట్టును గెలిపించిన విరాట్పై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తాయి.
తాజాగా ఆ సంఘటనను గుర్తు చేసుకున్న షాదాబ్ ఖాన్.. అలాంటి పరిస్థితుల్లో మరే ఆటగాడైనా భారత్ను గెలిపించలేకపోయేవాడని పేర్కొన్నాడు. ‘ఆ రోజు విరాట్ ఆటతీరు అమోఘం. మా చేతుల్లో ఉన్న మ్యాచ్ను అతడు లాక్కెళ్లాడు. ప్రపంచంలో మరే ప్లేయర్ అలాంటి ఇన్నింగ్స్ ఆడలేడు’ అని షాదాబ్ వెల్లడించాడు.