చెన్నై: వన్డే ప్రపంచకప్లో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. సోమవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో అఫ్గానిస్థాన్తో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. గత రెండు మ్యాచ్ల్లో పరాజయాలతో డీలా పడ్డ పాకిస్థాన్.. తిరిగి గెలుపు బాట పట్టాలని చూస్తుంటే.. స్పిన్కు స్వర్గధామమైన పిచ్పై తమ దమ్మేంటో చూపాలని అఫ్గాన్ భావిస్తున్నది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలతో పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. ఒకే ఒక్క గెలుపుతో అఫ్గానిస్థాన్ అట్టడుగున నిలిచింది.
అయితే మెగాటోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను మట్టికరిపించిన కాబూలీలు తమదైన రోజున ఎంతటి జట్టునైనా ఓడించ గలమని నిరూపించుకున్నారు. లీగ్ దశలో సగం మ్యాచ్లు ముగిసే దశకు చేరడంతో ఇక సెమీఫైనల్కు చేరాలంటే ప్రతి విజయం కీలకం కావడంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం కానుంది. ఈ మ్యాచ్ ద్వారా పాకిస్థాన్ తమ రన్రేట్ను సైతం మెరుగుపరుచుకోవాలని చూస్తుంటుంది. అయితే స్పిన్ను ఎదుర్కోవడంలో తడబడుతున్న పాక్ బ్యాటర్లు.. రషీద్ఖాన్, ముజీబ్, నబి త్రయాన్ని ఎలా ఎదుర్కుంటారనేది ఆసక్తికరం.
వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ మంచి ఫామ్లో ఉండగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీఖ్, ఇమామ్, షకీల్, నవాజ్, ఇఫ్తిఖార్ కలిసికట్టుగా రాణించాల్సి ఉంది. మరోవైపు టోర్నీకి ముందు అత్యంత పటిష్టంగా కనిపించిన పాక్ పేస్ విభాగంలోనూ మునుపటి వాడి లోపించింది. స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదిపై మరోసారి భారీ ఆశలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 7 వన్డేలు జరగగా.. ఏడింటా పాకిస్థాన్ విజయం సాధించింది.