ODI WC 2023 : ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇస్తోన్న వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) షెడ్యూల్ ఇప్పటికే వచ్చేసింది. అంతేకాదు వరల్డ్ కప్ క్వాలిఫైయర్ ఆఖరి రెండు బెర్తులను శ్రీలంక, నెదర్లాండ్స్ దక్కించుకున్నాయి. అయితే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) మాత్రం భారత్లో ఆడడంపై అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విషయాన్ని తేల్చడం కోసం పాక్ ప్రధాని షహ్బాజ్ షరీఫ్(Shahbaz Sharif) ఈరోజు ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాడు.
దానికి విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో(Bilawal Bhutto) నాయకుడు. భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలను, ప్రభుత్వ విధానాలను పరిశీలించనుంది. అంతేకాదు భారత్లో పాక్ క్రికెటర్లు, అధికారులు, అభిమానులు, మీడియాకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది కూడా ప్రధానికి నివేదించనుంది.
స్పోర్ట్స్ మినిస్టర్ అషాన్ మజారి, మర్యం ఔరంగజేబు, అసద్ మహమూద్, అమిన్ ఉల్ హక్, కమర్ జమన్ కైరా, మాజీ దౌత్యవేత్త తారిక్ ఫత్మి ఈ కమిటీలో సభ్యులు. పాక్ మంత్రుల బృందం ఇప్పటికే భారత్లో పాకిస్థాన్ ఆటగాళ్ల భద్రత గురించి పూర్తి స్థాయి సమాచారం ఇవ్వాలని ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఆదేశించిన విషయం తెలిసిందే. త్వరలోనే పాక్ బృందం ఇండియాకు రానుంది. వరల్డ్ కప్ ఏర్పాట్లు, స్టేడియాలు, ఆటగాళ్లు బస చేసే హోటళ్ల వద్ద భద్రత తదితర విషయాలను పరిశీలించనుంది.
వరల్డ్ కప్ డ్రాఫ్ట్ షెడ్యూల్(ODI WC 2023 Draft Schedule) వచ్చాక పాక్ క్రికెట్ బోర్డు రెండు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అక్టోబర్ 5న భారత్, పాకిస్థాన్ తలపడనున్న అహ్మదాబాద్(Ahmedabad) వేదికను మార్చాలని, తమ జట్టు మ్యాచ్లను చెన్నై నుంచి బెంగళూరుకు తరలించాలని ఐసీసీని కోరింది. కానీ, ఐసీసీ(ICC) వాటిని లెక్కచేయకుండా యథావిధిగా షెడ్యూల్ విడుదల చేసింది.
అహ్మదాబాద్ స్టేడియంలో తలపడనున్న దాయాది జట్లు
దాంతో, అప్పటి పీసీబీ చైర్మన్ నజం సేథీ(Najam Sethi), అతడి తర్వాత బాధ్యతలు చేప్పటిన జకా అష్రఫ్(Zaka Ashraf) అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినా కూడా ఐసీసీ స్పందించలేదు. దాంతో, వరల్డ్ కప్లో పాక్ జట్టు ఆడాలా? వద్దా? అనే విషయమై ప్రధాని అనుమతి అవసరమని పీసీబీ పెద్దలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని అత్యున్నత స్థాయి కమిటీని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.