Asia Cup 2023 : టీమ్ఇండియాతో సూపర్-4 పోరులో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ఆ దేశ మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మల్(Kmran Akmal) మండిపడ్డాడు. అది కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam) బుర్ర తక్కువ నిర్ణయమని అతను అభిప్రాయపడ్డాడు. ఫ్లాట్ పిచ్పై బంతి చక్కగా బ్యాట్ మీదకు రావడంతో భారత ప్లేయర్లు దంచి కొట్టారు. దాంతో, టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగడంతో కమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తమ బౌలర్లపై ఓవర్ కాన్ఫిడెన్స్తోనే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని కమ్రాన్ ట్విట్టర వేదికగా వ్యాఖ్యానించాడు.
ఆదివారం భారత్, పాకిస్థాన్ పోరులో పాక్ పేస్ త్రయం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(56), శుభ్మన్ గిల్(58) దంచికొట్టడంతో భారత్కు మంచి ఆరంభం దక్కింది. మొదట గిల్ బాదుడు ప్రారంభిస్తే.. ఆ తర్వాత హిట్మ్యాన్ దాన్ని మరో స్థాయికి చేర్చాడు. ఈ ఇద్దరి ధాటికి కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పరుగుల వరద పారింది. అయితే హాఫ్ సెంచరీల అనతరం ఈ ఇద్దరూ ఔటయ్యారు. ఆ కాసేపటికే వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.
వాన ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. అయితే.. రేపు రిజర్వ్ డే(Reserve Day) ఉండడంతో 50 ఓవర్ల ఆటకు అవకాశం ఉంది. భారత జట్టు 24.1వ ఓవర్తో యథావిధిగా ఇన్నింగ్స్ కొనసాగించనుంది.