విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడటంతో ఈ సీజన్లో బెంగళూరు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ దెబ్బకు ఓ మాదిరి స్కోరుకు పరిమితమైన రాజస్థాన్.. కోహ్లీ, పడిక్కల్ పరుగుల సునామీలో కొట్టుకుపోయింది!
ముంబై: బౌలింగ్, బ్యాటింగ్లో సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్నది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (52 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (47 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో బెంగళూరు వరుసగా నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. గురువారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన పోరులో కోహ్లీ సేన 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. శివం దూబే (46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్ తెవాటియా (40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పడిక్కల్, కోహ్లీ ధాటికి బెంగళూరు 16.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసింది.
దంచుడే దంచుడు..
ఛేజింగ్లో బెంగళూరుకు మెరుపు ఆరంభం లభించింది. ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సారథి కోహ్లీ సిక్సర్తో ఖాతా తెరువగా.. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ బౌండ్రీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. ఫలితంగా పవర్ ప్లే ముగిసే సరికి కోహ్లీసేన వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. గోపాల్, మోరిస్ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదిన పడిక్కల్.. ముస్తఫిజుర్ ఓవర్లో 4,6 అరుసుకున్నాడు. పరాగ్ ఓవర్లో 4,6తో 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న పడిక్కల్.. తెవాటియాకు రెండు సిక్సర్లు రుచి చూపించాడు. కోహ్లీ కాస్త నెమ్మదించినా దేవదత్ దూకుడుతో 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 107 పరుగులు చేసింది. ఈ క్రమంలో కోహ్లీ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరగా.. పడిక్కల్ 51 బంతుల్లో ఐపీఎల్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో.. బెంగళూరు మరో 21 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
సిరాజ్ సూపర్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు శుభారంభం దక్కలేదు. సిరాజ్ దెబ్బకు ఆ జట్టు పవర్ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్లో బట్లర్ (8)ను సిరాజ్ ఔట్ చేస్తే.. మనన్ వోహ్రా (7)ను జెమీసన్ పెవిలియన్ పంపాడు. ప్రమాదకర మిల్లర్ (0)ను సిరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రాజస్థాన్ 5 ఓవర్లలో 22/3తో కష్టాల్లో పడింది. శాంసన్ (21) కూడా ఎక్కువ సేపు నిలువలేకపోగా.. దూబే, రియాన్ పరాగ్ (25; 4 ఫోర్లు) వేగంగా పరుగులు రాబట్టారు. దూబే ఔటైనా.. చివర్లో భారీ షాట్లతో విరుచుకపడిన తెవాటియా రాజస్థాన్కు పోరాడే స్కోరు అందించాడు.
స్కోరు బోర్డు
రాజస్థాన్: బట్లర్ (బి) సిరాజ్ 8, వోహ్రా (సి) రిచర్డ్సన్ (బి) జెమీసన్ 7, శాంసన్ (సి) మ్యాక్స్వెల్ (బి) సుందర్ 21, మిల్లర్ (ఎల్బీ) సిరాజ్ 0, దూబే (సి) మ్యాక్స్వెల్ (బి) రిచర్డ్సన్ 46, పరాగ్ (సి) చాహల్ (బి) హర్షల్ 25, తెవాటియా (సి) షాబాజ్ (బి) సిరాజ్ 40, మోరిస్ (సి) చాహల్ (బి) హర్షల్ 10, గోపాల్ (నాటౌట్) 7, సకారియా (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 0, ముస్తఫిజుర్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 13, మొత్తం: 177/9. వికెట్ల పతనం: 1-14, 2-16, 3-18, 4-43, 5-109, 6-133, 7-170, 8-170, 9-170, బౌలింగ్: సిరాజ్ 4-0-27-3, జెమీసన్ 4-0-28-1, రిచర్డ్సన్ 3-0-29-1, చాహల్ 2-0-18-0, సుందర్ 3-0-23-1, హర్షల్ 4-0-47-3.
బెంగళూరు: కోహ్లీ (నాటౌట్) 72, పడిక్కల్ (నాటౌట్) 101, ఎక్స్ట్రాలు: 8, మొత్తం: 16.3 ఓవర్లలో 181. బౌలింగ్: గోపాల్ 3-0-35-0, సకారియా 4-0-35-0, మోరిస్ 3-0-38-0, ముస్తఫిజుర్ 3.3-0-34-0, తెవాటియా 2-0-23-0, పరాగ్ 1-0-14-0.