Olympics | పారిస్: 128 ఏండ్ల విశ్వక్రీడల చరిత్రలో నూతన అధ్యాయం. ఒలింపిక్స్లో పాల్గొనే, పతకాలు గెలిచిన క్రీడాకారులకు పతకాలు తప్ప నగదు బహుమానం అందజేసిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. కానీ త్వరలో పారిస్ వేదికగా జరుగబోయే ఒలింపిక్స్లో ఈ సంప్రదాయానికి వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) ముగింపు పలికింది.
2024 ఒలింపిక్స్లో భాగంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగాల్లో పోటీపడి స్వర్ణ పతకాలు గెలిచే క్రీడాకారులకు నగదు బహుమానం కింద 50 వేల యూఎస్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.41.60 లక్షలు) అందించేందుకు సిద్ధమైంది. ఇలా నగదు బహుమానాన్ని ప్రకటించిన తొలి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యగా డబ్ల్యూఏ నిలిచింది. ఈ మేరకు బుధవారం వరల్డ్ అథ్లెటిక్స్ ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. ప్రోత్సాహకాలు అందించేందుకు గాను 2.4 మిలియన్ల యూఎస్ డాలర్లను ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వద్ద డిపాజిట్ చేసినట్టు తెలిపింది. మొత్తం 48 విభాగాల్లో పసిడి పతకాలు గెలిచే వారికి నగదు అందజేయనున్నారు.