ODI World Cup-23 | ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచ కప్కు భారత్ వేదిక జరుగనున్నది. అక్టోబర్ – నవంబర్ మధ్య జరిగే టోర్నీ షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉన్నది. అయితే, ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్ను సిద్ధం చేసి ఐసీసీకి బీసీసీఐ పంపింది. మరో వైపు టోర్నీలో పాల్గొనే పాక్ జట్టు స్పందన కోసం ఐసీసీ ఎదురు చూస్తున్నది. ముసాయిదా షెడ్యూల్పై పాక్ క్రికెట్ బోర్డు (PCB) విముఖత వ్యక్తం చేసింది. పాక్ క్రికెట్ బోర్డు రెండు మ్యాచులకు సంబంధించిన వేదికలను మార్చాలని ఐసీసీ, బీసీసీఐని డిమాండ్ చేసింది. దీనిపై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.
వాస్తవానికి ప్రపంచకప్లో పాల్గొనే అన్ని దేశాలకు ఐసీసీ ముసాయిదా షెడ్యూల్ను పంపింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 20న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో, చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్తో పాక్ ఆడాల్సి ఉంది. ఈ రెండు వేదికలను మార్చాలని పీసీబీ డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించి ఎలాంటి కారణాలు పీసీబీ వెల్లడించలేదు. అయితే, పాకిస్తాన్ ప్రతి మ్యాచ్లో ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగాలని భావిస్తున్న పాక్.. ఆస్ట్రేలియాతో, ఆఫ్ఘన్నిస్థాన్ జట్లతో చెపాక్లో ఆడేందుకు జంకుతున్నది.
చిన్నస్వామి స్టేడియంలో హైస్కోరింగ్ పిచ్ కావడం, చెపాక్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. దాంతో ఆఫ్ఘనిస్థాన్లో రషీద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ వంటి స్పిన్నర్లు ఉండడంతో పాక్ ఆందోళనకు గురవుతున్నది. ఈ క్రమంలో స్పిన్నర్ అశ్విన్ ఓ యూ ట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పీసీబీ చెప్పే కారణాలను ఐసీసీ అంగీకరిస్తుందని తాను భావించడం లేదని చెప్పాడు. భద్రతా కారణాలను చూపుతూ వేదికను మార్చాలని పాక్ కోరి ఉంటే అది జరిగి ఉండేదన్నారు.
2016 టీ20 ప్రపంచకప్లో భద్రతా కారణాల దృష్ట్యా భారత్తో మ్యాచ్ను ధర్మశాల మార్చాలన్న పీసీబీ కోరిక మేరకు.. కోల్కతా ఈడెన్ గార్డెన్స్కు భారత్ – పాక్ మ్యాచ్ను తరలించారు. చెన్నైలో పరిస్థితులు ఆఫ్ఘన్ జట్టుకు అనుకూలంగా ఉంటాయని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే, వేదికను మార్చితే పాక్కు మేలు చేసినట్లవుతుందన్న స్పిన్నర్.. ఐసీసీ పాక్ రిక్వెస్ట్ను పరిగణలోకి తీసుకుంటుందని అనుకోవడం లేదని చెప్పాడు. ఇదిలా ఉండగా.. వన్డే ప్రపంచ కప్కు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ ఈ నెల 27న అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.