Sourav Ganguly | ఒకప్పుడు పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్ అంటే.. చాలా ఉత్కంఠ భరితంగా సాగేవని.. ప్రస్తుత పాక్ జట్టుకు టీమ్ఇండియాకు పోటీనిచ్చే సీన్ లేదని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇప్పటి వరకు భారత్, పాకిస్థాన్ మధ్య 8 మ్యాచ్లు జరగ్గా.. ఎనిమిదింట్లోనూ టీమ్ఇండియానే విజయం సాధించింది. ఆ నేపథ్యంలో బెంగాల్ టైగర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజా మెగాటోర్నీలో శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన పోరులో పాకిస్థాన్ మరీ నాసిరకం ఆటతీరు కనబర్చిన విషయం తెలిసిందే. భారత బౌలింగ్ ధాటికి తట్టుకోలేక రెండొందల పరుగుల లోపే ఆలౌటైంది. దీంతో స్వల్ప లక్ష్యఛేదనలో రోహిత్ దంచికొట్టడంతో భారత్ సునాయాస విజయం ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో దాదా మాట్లాడుతూ.. ‘ఒకప్పటి పాకిస్థాన్ జట్లతో పోల్చుకుంటే.. ప్రస్తుత టీమ్ చాలా బలహీనంగా ఉంది. వాళ్లు కనీస పోరాటం లేకుండానే ఓటమిని ఆహ్వానించిన తీరు ఆక్షేపణీయం. గెలువాలన్న కసి లోపించినట్లు అనిపించింది. గతంతో పాక్తో మ్యాచ్ అంటే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగేవి. కానీ ఈసారి పూర్తి ఏకపక్షంగా సాగి నిరాశ పరిచింది’ అని అన్నాడు.
సుదీర్ఘ కాలం తర్వాత భారత్లో పర్యటిస్తున్న పాకిస్థాన్.. ఇదే ఆటతీరు కొనసాగిస్తే టోర్నీలో ముందంజ వేయడం కష్టమే అని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్ ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకోవడం లేదని అన్నాడు. భారత్తో మ్యాచ్లో మెరుగైన స్థితి నుంచి ఆ జట్టు టపటపా వికెట్లు కోల్పోవడాన్ని ఉదాహరించాడు. వరల్డ్కప్ వంటి టోర్నీల్లో రాణించాలంటే అన్ని రంగాల్లో సత్తాచాటక తప్పదని పేర్కొన్నాడు.