ODI World Cup | వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన కంగారూలు.. సోమవారం లక్నో వేదికగా శ్రీలంకతో ముగిసిన మ్యాచ్లో ఘనవిజయం సాధించారు. తొలుత లంకను 209 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. ఆ తర్వాత విజయలక్ష్యాన్ని 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిచెల్ మార్ష్ (51 బంతుల్లో52 , 9 ఫోర్లు)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (58 బంతుల్లో 58, 5 ఫోర్లు, 1 సిక్సర్), మార్నస్ లబూషేన్ (60 బంతుల్లో 40, 2 ఫోర్లు) రాణించారు. ఆఖర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ (21 బంతుల్లో 31 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. ఈ మెగాటోర్నీలో ఆసీస్కు ఇదే తొలి విజయం కాగా లంకకు హ్యాట్రిక్ ఓటమి.
మార్ష్ కేక..
స్వల్ప లక్ష్య ఛేదనలో కంగారూలు తమ ఇన్నింగ్స్ను దాడిగా ఆరంభించారు. మిచెల్ మార్ష్ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక.. నాలుగో ఓవర్లో డేవిడ్ వార్నర్ (11), స్టీవ్ స్మిత్ (0) లను పెవిలియన్కు పంపినా అదే జోరును లంక కొనసాగించలేకపోయింది. వరుసగా రెండు వికెట్లు పడ్డా మార్ష్ – లబూషేన్లు దూకుడుగానే ఆడారు. వెల్లలాగె వేసిన తొమ్మిదో ఓవర్లో మూడు బౌండరీలు బాదిన మార్ష్.. 39 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేశాడు. మార్ష్ బాదుతుండగా లబూషేన్ మాత్రం నిదానంగా ఆడాడు. ఈ ఇరువురూ మూడో వికెట్కు 58 పరుగులు జతచేశారు. ధాటిగా ఆడుతున్న మార్ష్.. అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు.
ముగించిన ఇంగ్లిస్ – మ్యాక్స్వెల్
మార్ష్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ కూడా నిలకడగా ఆడాడు. క్రీజులోకి రావడంతోనే రెండు బౌండరీలు బాదిన ఇంగ్లిస్.. ఆ తర్వాత లబూషేన్తో కలిసి ఆసీస్ను విజయం దిశగా తీసుకెళ్లాడు. 26 ఓవర్లకే ఆసీస్.. 150 పరుగులను దాటింది. ఇంగ్లిస్ 46 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేశాడు. గెలుపు దిశగా సాగుతున్న ఆసీస్కు రెండో స్పెల్లో మధుశంక.. మరో షాకిచ్చాడు. అతడు వేసిన 29వ ఓవర్లో ఐదో బంతికి మధుశంక.. లబూషేన్ను పెవిలియన్కు పంపాడు. లబూషేన్ నిష్క్రమణ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ వీరబాదుడు బాదాడు. మధుశంక వేసిన 31వ ఓవర్లో మూడు బౌండరీలు బాదిన మ్యాక్స్వెల్ తీక్షణ వేసిన తర్వాతి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఆఖర్లో ఇంగ్లిస్ నిష్క్రమించినా మ్యాక్స్వెల్, స్టోయినిస్ (10 బంతుల్లో 20 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్)లు లాంఛనాన్ని పూర్తి చేశారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంక.. 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. పతుమ్ నిస్సంక (61), కుశాల్ పెరీరా (78) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు.