IND vs BAN | వన్డే ప్రపంచకప్లో పూణే వేదికగా భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో భాగంగా బంగ్లా నిర్దేశించిన మోస్తారు లక్ష్య ఛేదనను టీమిండియా బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో ఊదేస్తున్నది. భారత ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ (40 బంతుల్లో 48, 7ఫోర్లు, 2 సిక్సర్లు) తో పాటు శుభ్మన్ గిల్ లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడుతూ.. స్కోరుబోర్డును పరుగులెత్తించారు. హాఫ్ సెంచరీకి రెండు పరుగుల ముందు రోహిత్ నిష్క్రమించినా భారత్ విజయం దిశగా సాలిడ్ స్టార్ట్ చేసింది.
బంగ్లా నిర్దేశించిన 257 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్కు వచ్చిన భారత ఓపెనర్లు తొలి ఓవర్ నుంచే బాదుడు మొదలుపెట్టారు. హిట్మ్యాన్.. షోరిఫుల్ ఇస్లాం వేసిన మొదటి ఓవర్లోనే రెండు బౌండరీలు బాదాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన రెండో ఓవర్లో తొలి బంతినే మిడాన్ దిశగా బౌండరీకి తరలించిన గిల్ పరుగుల ఖాతా తెరిచాడు. షోరిఫుల్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ 4, 6 బాదాడు. నసుమ్ అహ్మద్ వేసిన పదో ఓవర్లో గిల్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ముస్తాఫిజుర్ వేసిన 12వ ఓవర్లో గిల్.. మూడు బౌండరీలు బాది స్కోరుబోర్డు వేగాన్ని మరింత పెంచాడు.
హాఫ్ సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో హసన్ మహ్మద్ వేసిన 13వ ఓవర్లో మూడో బంతిని సిక్సర్ బాదిన రోహిత్.. నాలుగో బంతికి బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ లో తౌహిద్ హృదయ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
రోహిత్ నిష్క్రమించినా అతడి స్థానంలో వచ్చిన కోహ్లీ.. ఎదుర్కున్న రెండో బంతికే బౌండరీ కొట్టాడు. ఆ మరుసటి బంతినే సిక్సర్గా మలిచాడు. దీంతో 13 ఓవర్లకే భారత్ స్కోరు వంద పరుగుల మార్కును దాటింది. 14 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి భారత్.. రోహిత్ వికెట్ కోల్పోయి 110 పరుగుగుల చేసింది. గిల్ (41 నాటౌట్) తో పాటు కోహ్లీ (19 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.