ODI World Cup 2023 | వన్డే వరల్డ్ కప్లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్ – అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో మిడిల్ ఓవర్లలో తడబడ్డా కివీస్ జట్టు ఆఖర్లో పుంజుకుంది. గ్లెన్ ఫిలిప్స్ (74 బంతుల్లో 71, 4 ఫోర్లు, 4 సిక్సర్లు ), కెప్టెన్ టామ్ లాథమ్ (74 బంతుల్లో 68, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్.. 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. పది పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు తీసి కివీస్ను ఒత్తిడిలోకి నెట్టిన అఫ్గాన్ బౌలర్లు ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయారు. కీలక దశలో వికెట్లు తీయలేక తంటాలుపడ్డారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు వచ్చిన న్యూజిలాండ్ను ఆది నుంచే స్పిన్ ఉచ్చులో బంధించేందుకు అఫ్గాన్ పక్కా ప్రణాళికతో క్రీజులోకి అడుగుపెట్టింది. తొలి ఓవర్నే యువ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్కు ఇచ్చిన అఫ్గాన్ సారథి హష్మతుల్లా.. అందుకు ఫలితం రాబట్టాడు. 18 బంతులాడి మూడు ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసిన కాన్వేను ముజీబ్ ఏడో ఓవర్లో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కానీ మరో ఓపెనర్ విల్ యంగ్ (64 బంతుల్లో 54, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), వన్ డౌన్లో వచ్చిన రచిన్ రవీంద్ర (41 బంతుల్లో 32 , 2 ఫోర్లు, 1 సిక్సర్) రెండో వికెట్కు 79 పరుగులు జోడించారు.
పది బంతుల వ్యవధిలో మూడు వికెట్లు..
సాఫీగా సాగుతున్న కివీస్ ఇన్నింగ్స్లో అజ్మతుల్లా ఓమర్జాయ్ పెనుతుఫాను సృష్టించాడు. అజ్మతుల్లా వేసిన 20వ ఓవర్లో రెండో బంతికి రచిన్ రవీంద్రను బౌల్డ్ చేశాడు. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి విల్ యంగ్ కూడా ఇక్రమ్ అలిఖిల్ చేతికి చిక్కాడు. మరుసటి ఓవర్ వేసిన రషీద్ ఖాన్.. డారిల్ మిచెల్ (1)ను ఔట్ చేశాడు. దీంతో 20 వ ఓవర్లో 108-1గా ఉన్న కివీస్ స్కోరు.. 21.4 ఓవర్కు వచ్చేసరికి 110-4గా మారింది.
ఆదుకున్న లాథమ్, ఫిలిప్స్
110-4గా ఉన్న కివీస్ను కెప్టెన్ లాథమ్, గ్లెన్ ఫిలిఫ్స్లు ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి అఫ్గాన్ బౌలర్లకు మరో ఛాన్స్ ఇవ్వకుండా వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. స్కోరువేగం నెమ్మదించినా.. ఇద్దరూ వికెట్ కాపాడుకుంటూ వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తుతూ స్కోరుబోర్డులో వేగాన్ని పెంచారు. 69 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన ఫిలిప్స్ ఆ తర్వాత రెచ్చిపోయాడు. 43 ఓవర్లకు 205 పరుగులే ఉన్న కివీస్ స్కోరుబోర్డును ఆ తర్వాత ఫిలిప్స్ బాదుడుతో పరుగులు పెట్టించాడు. ఫజల్లా ఫరూఖీ వేసిన 45వ ఓవర్లో ఫిలిప్స్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఫిలిప్స్ స్ఫూర్తితో లాథమ్ కూడా రెచ్చిపోయాడు. నవీన్ ఉల్ హక్ వేసిన 45వ ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. అజ్మతుల్లా వేసిన 47వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. కానీ నవీన్ వేసిన మరుసటి ఓవర్లో తొలి బంతికే భారీ షాట్ ఆడబోయిన ఫిలిప్స్.. రషీద్ ఖాన్ చేతికి చిక్కాడు. దీంతో 144 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
ఆఖర్లో లాథమ్ను కూడా నవీన్ ఔట్ చేయడంతో చివర్లో వచ్చిన మార్క్ చాప్మన్ (25 నాటౌట్), మిచెల్ శాంట్నర్ (7 నాటౌట్)లు కివీస్ స్కోరును 280 దాటించారు.