వన్డే ప్రపంచకప్లో భాగంగా లక్నోలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా తొలి విజయం దిశగా సాగుతోంది. లంకేయులు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు ఓపెనర్ మిచెల్ మార్ష్ (51 బంతుల్లో 52, 9 ఫోర్లు) లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 210 పరుగుల ఛేదనలో ఆసీస్.. 18 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసింది.
లంక నిర్దేశించిన 210 పరుగులను ఛేదించే క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన కంగారూలు తొలి ఓవర్ నుంచే లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. లాహిరు కుమార వేసిన తొలి ఓవర్లోనే మార్ష్ బౌండరీ బాదాడు. అదే ఓవర్లో వార్నర్ (11).. స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. లక్నో పిచ్ స్పిన్కు సహకరిస్తుండటంతో మూడో ఓవర్లోనే స్పిన్నర్ మహీశ్ తీక్షణ రంగప్రవేశం చేశాడు. కానీ మార్ష్.. ఆ ఓవర్లో రెండు బౌండరీలు సాధించాడు.
షాకిచ్చిన మధుశంక..
మూడు ఓవర్లకే 24 పరుగులు చేసిన ఆసీస్కు నాలుగో ఓవర్లో మధుశంక షాకిచ్చాడు. అతడు వేసిన ఆ ఓవర్లో తొలి బంతికే వార్నర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. వన్ డౌన్లో వచ్చిన స్టీవ్ స్మిత్ మరోసారి నిరాశపరిచాడు. ఐదు బంతులు ఆడిన స్మిత్.. పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. స్మిత్ కూడా ఎల్బీడబ్ల్యూ అయ్యడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో క్రీజులోకి వచ్చిన మార్నస్ లబూషేన్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. లబూషేన్ – మార్ష్లు మూడో వికెట్కు 58 పరుగులు జోడించారు.
వార్నర్, స్మిత్ నిష్క్రమించినా మార్ష్ జోరు కొనసాగించాడు. వెల్లలాగె వేసిన తొమ్మిదో ఓవర్లో మూడు ఫోర్లు బాది అర్థ సెంచరీకి చేరువయ్యాడు. ఇదే క్రమంలో 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్ష్కు వన్డే ప్రపంచకప్లో ఇదే తొలి అర్థ శతకం కావడం గమానర్హం.
దూకుడుగా ఆడుతున్న మార్ష్.. అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. తీక్షణ వేసిన పదిహేనవ ఓవర్లో తొలి బంతిని కవర్స్ దిశగా ఆడిన మార్ష్ ఒకపరుగు పూర్తి చేశాడు. కానీ రెండో పరుగు తీసే క్రమంలో అతడు రనౌట్ అయ్యాడు. దీంతో ఆసీస్ మూడో వికెట్ను కోల్పోయింది.