Team India: ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టు ఇది ముగిశాక స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగబోయే పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలో భారత్కు ఇది కీలక టోర్నీ అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా హెడ్కోచ్ మారతాడా..? కీలక ఆటగాళ్లు కూడా దూరమవుతారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు భారత్ – ఆసీస్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది.
రెండేండ్ల క్రితం భారత క్రికెట్ హెడ్కోచ్ గా బాధ్యతలు చేపట్టిన ద్రావిడ్ ద్వైపాక్షిక సిరీస్లలో జట్టుకు విజయాలు సాధించిపెట్టినా 2022 ఆసియా కప్తో పాటు టీ20 వరల్డ్ కప్లో భారత్ను ఫైనల్ కూడా చేర్చలేకపోయాడు. భారత్లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ అతడి కోచింగ్ కెరీర్కు చాలా కీలకం కానుంది. టోర్నీ నెగ్గితే ద్రావిడ్ పోస్ట్కు వచ్చిన నష్టమేమీ లేదుగానీ ఫలితం తేడా కొడితే ద్రావిడ్ అండ్ కో.పై ఉద్వాసన అనే కత్తి వేలాడుతూనే ఉంది. కాగా, వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో ఆడబోయే టీ20 సిరీస్లో ద్రావిడ్ స్థానంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ బాధ్యతలు చూడనున్నాడని సమాచారం.
వన్డే ప్రపంచకప్ ఫలితం ఎలా ఉన్నా ద్రావిడ్ కు రెస్ట్ ఇచ్చి లక్ష్మణ్కు జట్టుకు మార్గదర్శకుడిగా ఉండే బాధ్యతలు అప్పగించినున్నట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది. దీనిపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ద్రావిడ్ లేని పక్షంలో మాకు లక్ష్మణ్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నాడు. వరల్డ్ కప్ తర్వాత అతడు బ్రేక్ తీసుకుంటాడు..’ అని చెప్పాడు.
కెప్టెన్ కూడా..!
అంతేగాక సుదీర్ఘ షెడ్యూల్ తర్వాత పలువురు భారత రెగ్యులర్ ఆటగాళ్లకు కూడా ఆసీస్తో టీ20 సిరీస్లో విశ్రాంతినిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదివరకే బంగ్లాదేశ్తో మ్యాచ్లో కాలి గాయంతో బాధపడుతున్న హార్ధిక్ పాండ్యాకు వన్డే ప్రపంచకప్ తర్వాత విశ్రాంతినిచ్చి టీ20 స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జూన్లో జరుగబోయే పొట్టి ప్రపంచకప్లో హార్ధిక్ లేనిపక్షంలో మరో సారథి కోసం ఈ ప్రయోగాలు ఉపయోగపడతాయని బీసీసీఐ భావిస్తోంది. ఇదివరకే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లను టీ20లలో పక్కనబెట్టిన బీసీసీఐ.. వారికి కూడా విశ్రాంతినివ్వనుంది.
టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు ఎక్కువ ఛాన్సులిచ్చేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రణాళికలు రచిస్తోంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, రింకూ సింగ్ వంటి ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని ఎక్కువ మ్యాచ్లు ఆడించే అవకాశాలున్నాయి. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘వరల్డ్ కప్ తర్వాత పలువురు ఆటగాళ్లకు బ్రేక్ దొరకుతుంది. దీంతో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు..’ అని తెలిపాడు.