దుబాయ్: ఇండియా, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఇప్పట్లో ఉండదని అంతర్జాతీయ క్రికెట్ మండలి అభిప్రాయపడింది. ఐసీసీ తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలార్డిస్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఇండోపాక్ సిరీస్ నిర్వహణ కోసం ఐసీసీ జోక్యం చేసుకునే ప్రసక్తి లేదన్నారు. ఆ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్లో పాల్గొనేందుకు తామేమీ చేయలేమన్నారు. కానీ ఆ రెండు జట్లు తాము నిర్వహించే టోర్నీల్లో ఆడితే తాము ఎంజాయ్ చేస్తామన్నారు. ఇండోపాక్ దేశాల మధ్య ఉన్న సంబంధాలు, ఆ రెండు దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులను ఐసీసీ ప్రభావితం చేయలేదని జెఫ్ అలార్డిస్ తెలిపారు. ఇతర ద్వైపాక్షిక సిరీస్ల తరహాలో.. ఒకవేళ రెండు బోర్డులు అంగీకరిస్తే వాళ్లు ఆడుతారు, ఒకవేళ వాళ్లు అంగీకరించకుంటే, వాళ్ల మధ్య పోటీ ఉండదన్నారు. అయితే ఇప్పట్లో ఇండియా, పాక్ మధ్య క్రికెట్ సిరీస్ ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చారు. టెస్ట్ చాంపియన్షిప్లో ఇద్దరూ పోటీపడరని, ఒకవేళ ఫైనల్లో ఆడాల్సి వస్తే, తటస్థ వేదికపై ఆ మ్యాచ్ను నిర్వహిస్తామని జెఫ్ తెలిపారు.