BCCI: అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిఉన్నాడంటూ టీమిండియా యువ బౌలర్, ఐపీఎల్లో గత సీజన్ వరకూ ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన చేతన్ సకారియాను బ్లాక్ లిస్ట్లో పెట్టిన బీసీసీఐ.. 24 గంటలు ముగియకముందే యూటర్న్ తీసుకుంది. చేతన్ సకారియా అనుమానిత బౌలింగ్ యాక్షన్ జాబితాలో సకారియా లేడని, సమాచార లోపం వల్ల ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. బీసీసీఐ జాబితాలో చేర్చింది కర్నాటక బౌలర్ను అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా తెలిపారు.
ఇదే విషయమై జయదేవ్ షా మాట్లాడుతూ.. ‘సమాచార లోపం వల్ల ఇలా జరిగింది. అనుమానిత యాక్షన్ కలిగి ఉన్న బౌలర్ల జాబితాలో చేతన్ లేడు. అది కర్నాటకకు చెందిన మరో బౌలర్. ఇదే విషయాన్ని మేం ఐపీఎల్ ఫ్రాంచైజీలీకు అందజేశాం..’ అని అన్నారు. సకారియా ఇప్పటివరకూ ఐపీఎల్లో 19 మ్యాచ్లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టు తరఫున ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు.
చేతన్ సకారియాను ఈ ఏడాది రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని వేలానికి వదిలేసింది. అతడు త్వరలో దుబాయ్ వేదికగా ఈనెల 19న జరగాల్సి ఉన్న ఐపీఎల్ వేలంలో రూ. 50 లక్షల బేస్ ప్రైస్తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బీసీసీఐ శుక్రవారం విడుదల చేసిన జాబితాలో తనుష్ కోటియన్ (ముంబై), రోహన్ కన్నుమ్మల్ (కేరళ), చిరాగ్ గాంధీ (గుజరాత్), సౌరభ్ దూబే (విదర్భ), అర్పిత్ గులేరియా (హిమాచల్ ప్రదేశ్)లు ఉన్నారు. వీరి బౌలింగ్ యాక్షన్పై అనుమానాలు ఉన్నా బౌలింగ్ చేయకుండా నిషేధం విధించలేదు.