సఫారీలతో సిరీస్కు బీసీసీఐ నిర్ణయం
న్యూఢిల్లీ: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్కు బయోబబుల్ను ఎత్తివేశారు. క్రీడాకారుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో బయోబబుల్తోపాటు కఠిన క్వారంటైన్ను కూడా ఎత్తివేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. జూన్ 9 నుంచి 19 వరకు ఢిల్లీ, కటక్, విశాఖపట్టణం, రాజ్కోట్, బెంగళూరు వేదికలుగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ప్రస్తుతం ఐపీఎల్లో ఆటగాళ్లు రెండు నెలల పాటు బయోబబుల్లోనే ఉన్నారు. మే 29న లీగ్ ముగిసిన పది రోజులకు ఈ సిరీస్ షురూ కానుంది. మరోసారి బుడగలోకి వెళ్తే ప్లేయర్ల మానసిక పరిస్థితిపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉండడంతో బోర్డు కరోనా నిబంధనలను సరళతరం చేసింది. ఈ నేపథ్యంలో కఠిన క్వారంటైన్, బయోబబుల్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ‘ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితి అదుపులోకి వచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్కు బయో బబుల్, కఠిన క్వారంటైన్ ఉండదు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో కూడా ఇవి ఉండవు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.
కొందరికి విశ్రాంతి:
సఫారీ సిరీస్పై టీమ్ మేనేజ్మెంట్ దృష్టి సారించింది. ఈ మ్యాచ్లకు కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, కీపర్ రిషబ్ పంత్, పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అందుబాటులో ఉంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘ప్లేయర్లు కొన్ని మ్యాచ్లు ఆడుతారు.. మరికొన్నింటికి విశ్రాంతి పొందుతారు’ అని బోర్డు ప్రతినిధి పేర్కొన్నారు. ఐపీఎల్లో రాణిస్తున్న హార్దిక్ పాండ్యాను కూడా ఈ సిరీస్కు ఎంపిక చేసే అవకాశం ఉందని.. కుదరకపోతే ఐర్లాండ్తో టీ20 సిరీస్కు నేరుగా జట్టులోకి వస్తాడని అభిప్రాయపడ్డారు.