టీమిండియాకు 2017 నుంచి 2021 వరకు హెడ్ కోచ్గా ఉన్న రవిశాస్త్రి.. భారత జట్టు ప్రదర్శనను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఐసీసీ టోర్నీలు నెగ్గలేదన్న బెంగ మినహా కెప్టెన్ విరాట్ కోహ్లి- హెడ్ కోచ్ రవిశాస్త్రిల కాలంలో భారత జట్టు మెరుగైన ఫలితాలనే సాధించింది. అయితే రవిశాస్త్రి తర్వాత ఎవరు..? అన్న ప్రశ్నకు సమాధానంగా వచ్చిన మిస్టర్ డిఫెండబుల్ రాహుల్ ద్రావిడ్పై తాజాగా రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇండియా-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా కామెంట్రీ బాధ్యతలు నిర్వహిస్తున్న శాస్త్రి మాట్లాడుతూ.. ‘నా తర్వాత టీమిండియాకు హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ కంటే బెటర్ పర్సన్ లేడు. నాకు ఈ జాబ్ (హెడ్ కోచ్ పదవి) అనుకోకుండా వచ్చింది. నేను కామెంట్రీ చెబుతున్నప్పుడు నాకు ఈ అవకాశమిచ్చి గ్రౌండ్లోకి వెళ్లమని చెప్పారు. కానీ ద్రావిడ్ అలా కాదు.. అతడు ఏం చేసినా పర్ఫెక్షన్ ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం పనులను పూర్తి చేస్తాడు..
టీమిండియాకు హెడ్ కోచ్ కాకముందు ద్రావిడ్ ఇండియా అండర్-19 జట్టుకు కోచ్గా వ్యవహరించాడు. అక్కడ మంచి ఫలితాలను రాబట్టాడు. ఇప్పుడిప్పుడే అతడు సీనియర్ జట్టుపై తనదైన మార్కును వేస్తున్నాడు. ఇక్కడ కూడా అతడి ముద్ర స్పష్టంగా పడితే అప్పుడు ఫలితాలు మరో విధంగా ఉంటాయి…’ అని శాస్త్రి తెలిపాడు.
2014లో భారత క్రికెట్ జట్టుకు డైరక్టర్గా నియమితుడైన శాస్త్రి.. 8 నెలల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత 2017లో మళ్లీ టీమిండియాకు హెడ్ కోచ్గా వచ్చాడు. అప్పటినుంచి గతేడాది దుబాయ్లో ముగిసిన టీ20 ప్రపంచకప్ వరకు సేవలందించాడు. ఆ తర్వాత హెడ్ కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రావిడ్ మోస్తున్నాడు.