లండన్: ప్రపంచ నంబర్వన్, ఆస్ట్రేలియన్ స్టార్ ఆష్లే బార్టీ తొలిసారి వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో బార్టీ 6-1, 6-3 తేడాతో తన దేశానికే చెందిన అన్సీడెడ్ అజ్లా తోమ్ల్జోనోవిచ్పై గంటా ఆరు నిమిషాల్లోనే అలవోకగా గెలిచింది. ఆది నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన బార్టీ ఐదు ఏస్లు, 23 విన్నర్లు బాదితే.. అజ్లా కేవలం ఐదు విన్నర్లే కొట్టగలిగింది. ప్రత్యర్థి సర్వీస్ను ఆష్లే ఆరుసార్లు బ్రేక్ చేసింది. రెండో సీడ్ అరినా సబలెంకా (బెలారస్), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) కూడా తొలిసారి వింబుల్డన్ సెమీస్ చేరారు. క్వార్టర్స్లో ఓన్స్ జుబేర్పై 6-4, 6-3 తేడాతో సబలెంకా, విక్టోరిజా గోలుబిక్పై 6-2, 6-2తో ఎనిమిదో సీడ్ ప్లిస్కోవా విజయాలు సాధించారు. మరో మ్యాచ్లో మాజీ చాంపియన్ అంజెలిక్ కెర్బర్ 6-2, 6-3తో కరోలినా ముచోవాపై వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్ ఫోర్కు చేరింది.
మెద్వెదెవ్కు షాక్: పురుషుల సింగిల్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (జర్మనీ) వీరోచితంగా పోరాడినా ఓటమిని తప్పించుకోలేకపోయాడు. 14వ సీడ్ హుబర్ట్ హుర్కజ్ (పోలండ్)తో ప్రిక్వార్టర్స్లో 6-2, 6-7 (2/7), 6-3, 3-6, 3-6 తేడాతో ఐదు సెట్ల పాటు పోరాడి డానిల్ ఓటమి పాలయ్యాడు. మరో మ్యాచ్లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ 7-5, 6-4, 6-2 తేడాతో లొరెంజో సొనెగోను చిత్తుచేసి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు.